వేసవి సెలవుల అనంతరం తెలంగాణ వ్యాప్తంగా సోమవారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. కొత్త విద్యా సంవత్సరం తొలి రోజు నుంచే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం అల్పాహార పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని 1,269 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పథకాన్ని అమలు చేస్తుండగా, దీని ద్వారా సుమారు 1.44 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ పథకం కింద విద్యార్థులకు వారంలో మూడు రోజులు పాలు, మిగిలిన మూడు రోజులు రాగి మాల్ట్ అందిస్తారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులందరికీ ఈ అల్పాహారం వర్తిస్తుంది. ఇప్పటికే అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు కూడా విస్తరించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడం, హాజరు శాతం పెంచడం, డ్రాపౌట్లను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. 2026-27 రాష్ట్ర బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని రాజ్భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. చాలా రోజుల తర్వాత పాఠశాలలు తెరుచుకోవడంతో విద్యార్థుల సందడి నెలకొంది. కొత్త దుస్తులు, బ్యాగులతో విద్యార్థులు ఉత్సాహంగా బడిబాట పట్టారు.
పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఁపాఠశాల కేవలం పాఠాలు నేర్పే ప్రదేశం కాదు. మన వ్యక్తిత్వాన్ని, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే దేవాలయం. తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అందుకే విద్యా రంగాన్ని అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు అనేక సంస్కరణలు చేపట్టాంఁ అని సీఎం తన సందేశంలో పేర్కొన్నారు.
ఁఅల్పాహారం, మధ్యాహ్న భోజనం వంటి పౌష్టికాహారం అందించడమే కాకుండా, విద్యార్థుల భవిష్యత్తు కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థులు ఉత్సాహంగా చదువుకోవాలి. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో జ్ఞానాన్ని సంపాదించి, మీ కలలను సాకారం చేసుకోవాలి. విద్య అనేది ఎవరూ దొంగిలించలేని గొప్ప సంపదఁ అని విద్యార్థులకు సూచించారు.


