ఫిబ్రవరి 27న విడుదల కానున్న ‘ది కేరళ స్టోరీ 2‘ సినిమాపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ చిత్రం కేరళ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా రూపొందించిన విద్వేషపూరిత ప్రచారమని ఆయన అభివర్ణించారు. శాంతియుతంగా ఉండే కేరళను ఉగ్రవాదానికి కేంద్రంగా చూపించే ప్రయత్నం ఈ సినిమా ద్వారా జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు.
కోర్టులు, దర్యాప్తు సంస్థలు ‘లవ్ జిహాద్‘ అంశాన్ని గతంలోనే తోసిపుచ్చాయని… దీన్ని మళ్లీ తెరపైకి తీసుకువచ్చి మతపరమైన విభజన సృష్టించేందుకు కొన్ని శక్తులు కుట్రలకు పాల్పడుతున్నాయని విజయన్ మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేసే ఇటువంటి చిత్రాలను ప్రజలు ఐక్యంగా తిరస్కరించాలని పిలుపునిచ్చారు. మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ సినిమాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు, ఈ సినిమా కేరళతో పాటు ఇతర రాష్ట్రాల్లోని మత మార్పిడి అంశాల చుట్టూ తిరుగుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.


