జిల్లా కార్యదర్శి రేఖా భాస్కరరావు
విశాలాంధ్ర – రాజమహేంద్రవరం : సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా సీపీఐ కార్యదర్శి రేఖా భాస్కరరావు గడప గడపకూ సీపీఐ కార్యక్రమాన్ని చేపట్టి పార్టీని మరింత బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రం నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం నిడదవోలు, పెరవలి, గోపాలపురం తో పాటూ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో చేపట్టనున్నట్లు భాస్కరరావు తెలిపారు. జిల్లా సహాయ కార్యదర్శి కె.రాంబాబు మాట్లాడుతూ పార్టీ శ్రేణులు సంసిద్ధం గా ఉండాలని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. దీనితో సోమవారం ముందుగా జిల్లా కేంద్రం రాజమండ్రి లో 45 వ వార్డు గాదిరెడ్డి నగర్ లో సీపీఐ పట్టణ కార్యదర్శి వి.కొండలరావు, సహాయ కార్యదర్శి సప్పా రమణ ఆధ్వర్యంలో ప్రారంభించారు . ప్రజలకు కరపత్రాలు పంచుతూ, స్థానిక సమస్యలను తెలుసుకుంటూ వాటిని నమోదు చేసుకుంటూ విరాళాలు సేకరించారు. పార్టీ చరిత్ర, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, కూటమి ప్రభుత్వం
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కమ్యూనిస్ట్ పార్టీ ముద్రించిన కరపత్రాలను ప్రజలకు ఇస్తూ ప్రసార కార్యక్రమాన్ని నిర్వహించారు. సీపీఐ కార్యక్రమం మార్చి 15 వరకు కొనసాగుతుందని దానికి ప్రజలు విరాళాలు ఇస్తూ సహకరించాలని కోరారు.
కార్యక్రమం లో సీపీఐ కార్యవర్గ సభ్యులు పి. లావణ్య, కె. శ్రీనివాస్, పి. త్రిమూర్తులు, జట్లసంఘం అధికారబాడీ సభ్యులు దేముడు బాబు, వెంకట్రావు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు


