చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
అనపర్తి ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ టి రామగుర్రెడ్డి.
విశాలాంధ్ర – అనపర్తి : చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జలుబు, జ్వరం, దగ్గు వంటి వైరల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. తాడి రామ గుర్రెడ్డి సూచించారు. అనపర్తి ఏరియా ఆసుపత్రిలో విలేకరులతో మాట్లాడుతూవృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని అన్నారు.రోజుకు వేడి ఆహారం, కాచి చల్లార్చిన గోరువెచ్చని నీరు తీసుకోవాలని తెలిపారు.పొగమంచు ఎక్కువగా ఉన్న ఉదయం బయటకు వచ్చే సమయంలో ఉన్ని దుస్తులు ధరించాలని అన్నారు.ఎండ వచ్చిన తర్వాత వాకింగ్ చేయాలి లేదా సాయంత్రం వ్యాయామం చేయాలి. బయటికి వెళ్లేవారు ఉన్ని దుస్తులు, గ్లౌజులు, మంకీ క్యాప్ ధరించాలి. ఏడాది లోపు చిన్నారులు ఉంటే వారికి దగ్గరయ్యే ముందు చేతులు శుభ్రపరచుకోవాలి, వీలైతే బయటకు తిప్పకూడదని అన్నారు. భోజనం ముందు, బాత్రూం తర్వాత చేతులు కడుక్కోవాలి. జలుబు లేదా జ్వరం లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆయన కోరారు.


