ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి ప్రజలకు భారీ శుభవార్త అందించింది.
ఇకపై 50 చదరపు గజాల లోపు ఇళ్ల నిర్మాణానికి కేవలం ఒక్క రూపాయి ఫీజుతోనే అనుమతులు మంజూరు చేయనుంది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది.ఇంతకుముందు ఇంటి నిర్మాణానికి అనుమతి ఫీజు రూ.3,000గా వసూలు చేసేవారు. అయితే తాజా ఉత్తర్వులతో ఆ ఫీజు కేవలం రూ.1కి తగ్గిపోయింది.నగరపాలక సంస్థలు, నగరపంచాయతీల పరిధిలోని పేద, మధ్యతరగతి వర్గాల కుటుంబాలు ఈ సౌకర్యాన్ని పొందనున్నాయి.
రూ.6కోట్లకు పైగా భారం తగ్గే అవకాశం
ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఆన్లైన్లోనే డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి, ఒక్క రూపాయి ఫీజు చెల్లించేలా ప్రభుత్వం సౌకర్యం కల్పించింది.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రజలపై సుమారు రూ.6 కోట్లకు పైగా భారం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఇకపై పేదలు, మధ్యతరగతి వర్గాలకు ఒక్క రూపాయికే ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం అధికారికంగా అమల్లోకి వస్తోందని, ఈ నిర్ణయం ఆ వర్గాలకు నిజమైన శుభవార్తగా నిలుస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.


