హంతకులకు ఎప్పుడు శిక్ష పడుతుంది?
శిక్ష నాకా లేక నిందితులకా అనేది అర్థం కావడంలేదు…
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇంకెన్నాళ్లు పోరాడాలని ఆయన కూమార్తె వైఎస్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. హంతకులకు ఎప్పుడు శిక్ష పడుతుందని ఆమె ప్రశ్నించారు. పులివెందులలోని వివేకా ఘాట్ వద్ద సునీత దంపతులు నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడారు. తన తండ్రిని హత్య చేసిన నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, వారికి ఇంకెప్పుడు శిక్ష పడుతుందని ప్రశ్నించారు. ఇంకెన్నాళ్లు న్యాయపోరాటం చేయాలని సునీత ఆవేదన వ్యక్తం చేశారు.
ాకోర్టులో వివేకా హత్య కేసు విచారణ కోర్టులో వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. నిందితులతో పాటు నేను కూడా విచారణకు హాజరవుతున్నాను. న్యాయం కోసం ఇంకెన్నాళ్లు పోరాడాలి? శిక్ష నిందితులకా లేక నాకా అనేది అర్థం కావడంలేదు. సీబీఐ విచారణ అసంపూర్తిగా ఉందని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాను. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. అప్పుడు పోలీసులను బెదిరించి సాక్ష్యాధారాలన్నీ తుడిపేశారు. ఇప్పుడు జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా మళ్లీ బెదిరించాలని చూస్తున్నారు. హింస లేని కొత్త పులివెందులను ప్రజలు చూడాలనుకుంటున్నారు. అందుకోసమే నేను పోరాడుతున్నాను అని సునీత పేర్కొన్నారు.


