దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన పేలుడు కేసుకు సంబంధించి దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది కేవలం ఒక్క నగరానికి పరిమితమైన దాడి కాదని, దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సిరియల్ పేలుళ్లకు జైషే మహ్మద్తో సంబంధమున్న ఓ వైట్ కాలర్ ఉగ్రవాద ముఠా భారీ కుట్ర పన్నినట్లు తేలింది. ఈ కుట్రకు 2023లోనే బీజం పడిందని నిందితుల్లో ఒకరు విచారణలో అంగీకరించినట్లు ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. ఈ నెల 10న ఎర్రకోట సమీపంలో ఓ కారులో జరిగిన పేలుడులో 13 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే, ఇది ఉగ్రవాదులు భయంతో ముందుగానే పేల్చేయడం వల్ల జరిగిందని, అసలు ప్రణాళిక మరింత పెద్దదని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఆత్మాహుతి బాంబర్ ఉమర్ మహ్మద్ సహచరుడైన డాక్టర్ ముజమ్మిల్ షకీల్ను జాతీయ దర్యాప్తు సంస్థ విచారించగా కీలక వివరాలు వెల్లడయ్యాయి. రెండేళ్లుగా పేలుడు పదార్థాలు, రిమోట్లు, ఇతర సామగ్రిని సేకరిస్తున్నట్లు ముజమ్మిల్ ఒప్పుకున్నాడు.ఈ కుట్ర కోసం హర్యానాలోని గురుగ్రామ్, నుహ్ ప్రాంతాల నుంచి రూ.3 లక్షలతో 26 క్వింటాళ్ల ఎన్పీకే ఎరువులు, అమ్మోనియం నైట్రేట్ కొనుగోలు చేశాడు. ఫరీదాబాద్లోని మార్కెట్ల నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలు సమకూర్చుకున్నాడు. రసాయనాలను నిల్వ చేసేందుకు ఓ డీప్ ఫ్రీజర్ను కూడా కొనుగోలు చేసినట్లు తేలింది. ఈ కుట్ర కోసం ముఠా సభ్యులు సొంతంగా రూ.26 లక్షలు సమకూర్చుకోవడం గమనార్హం.విచారణలో తుర్కియే, పాకిస్థాన్తో ఉన్న సంబంధాలు కూడా బయటపడ్డాయి. ముజమ్మిల్, ఆదిల్, ముజఫర్ అనే ముగ్గురు నిందితులు తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్ సభ్యుడి ఆదేశాలతో తుర్కియేకి వెళ్లినట్లు అంగీకరించారు. దర్యాప్తు కొనసాగే కొద్దీ ఈ ఉగ్ర ముఠా వెనుక ఉన్న మరిన్ని దేశీయ, విదేశీ శక్తుల గుట్టు రట్టయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.


