ప్రభుత్వంపై విప్లవం తీసుకురావాలంటూ టీవీకే నేత అధవ్ అర్జున పోస్ట్
నేపాల్, శ్రీలంక యువతలా తిరగబడాలని తమిళ యువతకు పిలుపు
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ సీనియర్ నేత చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. అధికార డీఎంకే దుష్ట ప్రభుత్వంపై నేపాల్ యువతలా తిరుగుబాటు చేయాలంటూ టీవీకే ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున ఎక్స్ లో పిలుపునివ్వడం వివాదానికి దారితీసింది. కరూర్ సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన 48 గంటల్లోపే ఈ పోస్ట్ రావడం గమనార్హం. వివాదం ముదరడంతో ఆ పోస్ట్ను వెంటనే తొలగించారు. యువత నేతృత్వంలోని విప్లవమే దీనికి ఏకైక పరిష్కారం. శ్రీలంక, నేపాల్లలో జెన్ జీ యువత అక్కడి ప్రభుత్వాలపై తిరగబడింది. ఇక్కడ కూడా యువతే విప్లవానికి నాయకత్వం వహిస్తుంది. ఆ విప్లవమే ప్రభుత్వ మార్పునకు కారణమవుతుంది. దుష్ట పాలకుడి కింద చట్టాలు కూడా దుష్టంగానే మారతాయి అని అధవ్ అర్జున తన పోస్టులో పేర్కొన్నారు. రోడ్డుపై నడిచినందుకే పోలీసులు ప్రజలపై దాడులు చేస్తున్నారని, సోషల్ మీడియాలో అభిప్రాయాలు చెప్పినందుకు అరెస్టులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.అధవ్ అర్జున పోస్ట్పై డీఎంకే తీవ్రంగా స్పందించింది. లోక్సభ ఎంపీ కనిమొళి ఈ పోస్ట్ను బాధ్యతారహితమైనది అని అభివర్ణించారు. ఇది రాష్ట్రంలో హింసను ప్రేరేపించేలా ఉందని ఆమె హెచ్చరించారు. వివాదం తీవ్రం కావడంతో టీవీకే వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆ పోస్ట్తో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, అది అర్జున వ్యక్తిగత అభిప్రాయమని స్పష్టం చేసింది. పార్టీ గానీ, విజయ్ గానీ ఎన్నడూ ప్రజలను, హింసను రెచ్చగొట్టరు అని టీవీకే వర్గాలు తెలిపాయి.
విజయ్ పార్టీ నేత విప్లవం పోస్ట్..నేపాల్, శ్రీలంక యువతలా తిరగబడాలని తమిళ యువతకు పిలుపు
- Advertisement -


