. ఆర్టీజీఎస్ డేటా లేక్ ద్వారా వివరాల సేకరణ
. ప్రభుత్వ పథకాలు, పౌర సేవల పర్యవేక్షణ
. కుటుంబ ప్రయోజన నిర్వహణ వ్యవస్థపై సీఎం చంద్రబాబు సమీక్ష
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఒక యూనిట్గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కుటుంబ సాధికారిత కోసం ఈ వ్యవస్థను వినియోగించాలని సూచించారు. సోమవారం సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అందిస్తున్న పౌర సేవల్ని, ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి పర్యవేక్షించాలని అధికారులకు మార్గనిర్దేశనం చేశారు. దీనికి సంబంధించి స్మార్ట్ ఫ్యామిలీ కార్డును జారీ చేయాలని ఆదేశించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ నిర్వహిస్తున్న డేటా లేక్ ద్వారా సమాచార సేకరణ జరగాలని సూచించారు. రాష్ట్రంలోని 1.4 కోట్ల కుటుంబాలకు జూన్ నాటికి క్యూఆర్ కోడ్తో కూడిన ఫ్యామిలీ కార్డును జారీ చేయాలన్నారు. 25 రకాల వివరాలతో పాటు పీ4 లాంటి అంశాలను అందులో చేర్చాలి. ఆర్టీజీఎస్ వద్ద ఉన్న సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకుని ఇతర ప్రభుత్వ శాఖలు కూడా వినియోగించుకోవాలి. వాక్సినేషన్, ఆధార్, ఎఫ్బీఎంఎస్ ఐడీ, కుల ధృవీకరణ, పౌష్టికా హారం, రేషన్ కార్డు , స్కాలర్షిప్, పెన్షన్లు సహా వేర్వేరు ప్రభుత్వ పథకాలు, సేవలకు సంబంధిం చిన వివరాలన్నీ ఈ కార్డు ద్వారా ట్రాకింగ్ జరిగేలా చూడాలి. కేవలం పెన్షన్లు, రేషన్ వంటి పథకాల వివరాలకు మాత్రమే ఈ ఎఫ్బీఎంఎస్ వ్యవస్థను పరిమితం చేయకుండా, పౌరులకు చెందిన అన్ని వివరాలనూ నమోదు చేసేలా ఈ కార్డు ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. సుపరిపాలనలో భాగంగా ఈ కార్డు ద్వారా అర్హులైన వారందరికీ పథకాలు అందించ టంతో పాటు సులభంగా పౌర సేవలు అందించా లన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఒకే కార్డు ద్వారా పౌరులు అన్ని ప్రభుత్వ సేవల్ని, పథకాలను అందేలా చూడాలని చెప్పారు. ఆధార్ సహా అన్ని వివరాలూ ఈ ఒక్క కార్డు ద్వారానే తెలిసేలా రూపొందించి, 2026 జనవరి నాటికి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి జూన్లోగా కార్డులు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమీక్షకు సీఎస్ కె. విజయానంద్, ఆర్ధిక, వైద్యారోగ్య, గ్రామవార్డు సచివాలయ, పురపాలక, ప్లానింగ్ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వీర్యానికి త్వరలో విధాన నిర్ణయం
అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాలను డిస్పోజ్ చేసేందుకు ఓ విధాన నిర్ణయం తీసుకోవాలని సీఎం ఆదేశించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో సహా వివిధ శాఖల అధికారులతో సోమవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ…‘రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కాలుష్యాన్ని నెట్ జీరో స్థాయికి తగ్గించాలి. గాలి, నీరు, ఇండస్ట్రీయల్ వేస్ట్, బయో వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్ వంటి వాటిల్లో వివిధ రకాల అధ్యయనం చేయాలి. ఇందు కోసం టెక్నాలజీని వినియోగించాలి. ఎవరైనా నియమాలను అతిక్రమిస్తే… సదరు సంస్థలు.. వ్యక్తులకు ముందుగా హెచ్చరికలు జారీ చేసి ఆ తర్వాత చర్యలు తీసుకోవాలి. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగం తగ్గించేలా అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. వివిధ వ్యర్ధాలను సర్య్కలర్ పాలసీకి అనుసంధానం చేయాలి. ఇక ప్రత్యేకంగా బయో వేస్ట్ డిస్పోజల్స్ విషయంలో ఏ మాత్రం అలక్ష్యం వహించవద్దు. బయో వ్యర్థాలను కూడా 48 గంటల్లోగా డిస్పోజ్ చేయాల్సిందే. దీన్ని కచ్చితంగా పాటించాలి. పర్యవేక్షణకు టెక్నాలజీని… సీసీ టీవీలను వినియోగించాలని సీఎం ఆదేశించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు అవసరమైన సిబ్బంది కావాలని ఆ సంస్థ చైైర్మన్ కృష్ణయ్య ముఖ్యమంత్రిని కోరగా దీనికి సీఎం అంగీకారం తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, వైద్యారోగ్య శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


