. సివిల్స్ ఇంటర్వ్యూకు 43 మంది ఎంపిక
. ఇప్పటివరకు 342 అభ్యర్థులకు రూ.3.61 కోట్ల సాయం: భట్టి
విశాలాంధ్ర – హైదరాబాద్: సివిల్స్ అభ్యర్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం’ పథకం ద్వారా లబ్ధి పొందిన 43 మంది మెయిన్స్ కు ఎంపిక కావడం అభినందనీయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 342 మంది రూ.3.62 కోట్ల ఆర్థిక సహాయాన్ని సింగరేణి సంస్థ ద్వారా పొందారని వివరించారు. నిరుద్యోగ యువత కలలను సాకారం చేయడంలో భాగంగా సివిల్స్ మెయిన్స్, ఇంటర్వూలకు ఎంపికయిన వారికి ప్రతి దశలో రూ.లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తోంది అన్నారు. మెయిన్స్ కు ఎంపికైన 202 మంది సివిల్స్ విద్యార్థులకు ఒకొక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక ప్రోత్సహాన్ని అందించామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందులో 43 మంది ఇంటర్వ్యూకు ఎంపిక కావడం ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. వీరి మరో రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తామన్నారు. దిల్లీలో వారికి వసతి సౌకర్యాలు కల్పిస్తాం అన్నారు. ఇంటర్వ్యూలలోనూ సత్తా చాటి తెలంగాణ ప్రతిష్టను దేశవ్యాప్తం చేయాలని కోరారు. 2024లో ఈ పథకాన్ని ప్రారంభించగా మొదటి సంవత్సరం 140 మంది మెయిన్స్ కు ఎంపికయ్యారు, 20 మంది ఇంటర్వ్యూకు ఎంపిక కాగా అందులో ఏడుగురు సివిల్ సర్వీసెస్ సాధించి వివిధ హోదాల్లో స్థిరపడడం ప్రభుత్వానికి, ఆర్థిక సహకారం అందించిన సింగరేణికి గర్వకారణం గా భావిస్తున్నామన్నారు.


