వైసిపి అరకు పాడేరు సమన్వయకర్తలు మాధవి, విశ్వేశ్వర రాజు
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- 2024 లో జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో అరకు, పాడేరు నియోజకవర్గాలలో వైకాపా జెండా రెపరెపలాడిస్తామని ఆ పార్టీ అరకు, పాడేరు నియోజకవర్గాల సమన్వయకర్తలు గొడ్డేటి మాధవి, మత్యరాస విశ్వేశ్వర రాజు లు అన్నారు. సమన్వయ కర్తలుగా నూతనంగా నియమితులైన వారు ఒకరినొకరు కలుసుకున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని పుష్పగుచ్చాలు అందించుకుని శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సచివాలయ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పరిపాలనను నేరుగా ప్రజలకే చెందే విధంగా ప్రతి పథకం పారదర్శకంగా అమలు చేయడం వైకాపా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని మళ్లీమళ్లీ గెలిపించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. చిన్న వయస్కుడు అయినప్పటికీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పరిపక్వత చెందిన నేతగా ఎదిగారన్నారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని పునికి పుచ్చుకొని ప్రతి ఒక్క కుటుంబం బాగుండాలనే సదుద్దేశంతో పథకాలను నేరుగా లబ్ధిదారుని చెంతకు చేరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా వారు కొనియాడారు. రాబోవు సార్వత్రిక ఎన్నికలలో పాడేరు, అరకు నియోజకవర్గాలలో వైకాపా విజయం తద్యమని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.