పాక్ ప్రధాని షరీఫ్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మరోసారి జమ్మూ కశ్మీర్ అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలకు ప్రధాన కారణం కశ్మీర్ అని నోరు పారేసుకున్నారు. రెండు దేశాల మధ్య శాంతిస్థాపన కోసం 2019లో భారత సర్కార్ ఆర్టికల్ 370 రద్దు చేయడంపైనా ఆయన అక్కసు వెళ్లగక్కారు. ఈ విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏకపక్షంగా చర్యలు తీసుకుందని నిందలు వేశారు. ఈ సమస్యకు న్యాయపరమైన పరిష్కారానికి తమ విదేశాంగ విధానం కట్టుబడి ఉందంటూ షరీఫ్ మళ్లీ పాత పాటే పాడారు. మరోవైపు, తమ పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నామని పాక్ ఉప ప్రధాని ఇషాక్దార్ అన్నారు. ఘర్షణల కంటే దౌత్యాన్నే ఇష్టపడతామని వ్యాఖ్యానించారు. ఎవరైనా దురాక్రమణకు పాల్పడితే గట్టిగా బదులు ఇచ్చేందుకు తమ సాయుధ దళాలు ఎప్పటికీ ముందు వరుసలో ఉంటాయని చెప్పుకొచ్చారు. ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ సహా పలు ప్రావిన్స్లలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
కశ్మీరు వల్లే ఉద్రిక్తతలు
- Advertisement -


