భారత్, చైనా, బ్రెజిల్కు నాటో హెచ్చరిక
రష్యాపై ఒత్తిడి పెంచేందుకు అస్త్రంగా ‘వాణిజ్యం’
వాషింగ్టన్ : రష్యా – ఉక్రెయిన్ మధ్య భీకర పోరు ఏళ్ల తరబడి కొనసాగుతున్నది. అమెరికా అన్ని విధాలుగా ఉక్రెయిన్కు సహాయ సహకారాలు అందిస్తున్నది. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మల్చుకునేందుకు వాణిజ్యాన్ని అస్త్రంగా మార్చింది. రష్యాను ఏకాకి చేసే ప్రయత్నంలో భాగంగా ఆదేశంలో వాణిజ్యం వద్దంటూ ప్రపంచ దేశాలను హెచ్చరిస్తోంది. తమను కాదంటే సుంకాల మోత మోగిపోయిందని బెదిరిస్తోంది. రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగిస్తున్న భారత్, చైనా, బ్రెజిల్ తదితర దేశాలకు నాటో తాజాగా ఒక హెచ్చరిక చేసింది. రష్యాతో చమురు, గ్యాస్ దిగుమతి చేసుకోవడం ఆపకపోతే 100 శాతం సుంకాలు విధిస్తామని నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ హెచ్చరించారు. ‘భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలు రష్యాతో వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్నాయి. ఇది కొనసాగితే ఆ దేశాలపై 100 శాతం సుంకం విధిస్తాం’ అని అన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శాంతి చర్చలకు రాకపోతే పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. శాంతి చర్చలకు పుతిన్ సిద్ధమయ్యేలా ఆయనపై ఒత్తడి తేవాలని, లేనిపక్షంలో మూడు దేశాలకు సుంకాల రూపంలో దెబ్బలు తప్పవని మార్క్ హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇటీవల రష్యా మిత్ర దేశాలపై అదనపు సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. శాంతి చర్చలకు రష్యా ముందుకు రావాలని, లేకపోతే ఎగుమతులపైనా 100 శాతం సుంకాలు విధిస్తామని ఆయన బెదిరించారు.


