దేశంలో ప్రస్తుతం 270కి పైగా యాక్టివ్ కేసులు
దేశంలో మళ్లీ మహమ్మారి కరోనా వైరస్ పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా మరోసారి కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ప్రస్తుతం 270కి పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయా రాష్ట్రాలు ఆసుపత్రులను అప్రమత్తం చేశాయి. తగినన్ని ఆక్సిజన్ సిలిండర్లు, వ్యాక్సిన్లు, బెడ్లు, టెస్ట్ కిట్లను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించాయి. దేశంలోనే కేరళ రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల అత్యధికంగా ఉంది. దీంతో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో మాస్క్లను తప్పనిసరి చేశారు. దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉంటే ముఖానికి మాస్క్ ధరించాలన్నారు.
తొమ్మిది నెలల శిశువుకు కరోనా
కర్ణాటకలో కూడా కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్రంలో 35 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ తేలిన వారిలో తొమ్మిది నెలల శిశువు కూడా ఉంది. మహారాష్ట్ర ముంబయిలోనూ 95 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.
ఢిల్లీలో మూడేళ్ల తర్వాత తొలిసారి
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో మూడేళ్ల తర్వాత తొలిసారి ఈ నెలలో 23 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. తాజా వేరియెంట్ సాధారణ ఇన్ఫ్లు ఎంజా లాంటిది మాత్రమే అని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి పంకజ్ సింగ్ తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని అన్నారు.
అటు ఢిల్లీ-ఎన్సీఆర్ నగరాలైన ఘజియాబాద్, నోయిడాలోనూ కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఘజియాబాద్లో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… నోయిడాలో ఇవాళ తొలి కరోనా కేసు వెలుగు చూసింది. 55 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్గా తేలింది.
కోవిడ్-19 కొత్త వేరియంట్స్ కలకలం..!
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ కొత్త వేరియంట్లు వెలుగుచూస్తుండటం కలకలం సృష్టిస్తోంది. భారత్లో కోవిడ్-19 కొత్త వేరియంట్లు ఎన్బీ.1.8.1, ఎల్ఎఫ్.7 లను గుర్తించినట్లు ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం (IచీూAజూG) శనివారం వెల్లడించింది. ఎన్బీ.1.8.1 వేరియంట్ కేసు ఏప్రిల్లో వెలుగుచూడగా.. ఎల్ఎఫ్.7 కు సంబంధించి 4 కేసులను ఈ నెలలో గుర్తించినట్లు కన్సార్టియం వెల్లడించింది. ఆ కేసులు తమిళనాడు, గుజరాత్లో నమోదయ్యాయని తెలిపింది.