వైద్య చికిత్స కోసం వంశీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
ఆర్డర్ కాపీ అందిన తర్వాత విడుదల చేస్తామన్న జైలు అధికారులు
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసింది. విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స చేయించాలని ఆదేశిస్తూ… వంశీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 6వ తేదీ వరకు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.
అయితే, వంశీ ఇంకా జైలు నుంచి విడుదల కాలేదు. విజయవాడ జిల్లా జైలు అధికారులకు కోర్టు ఆర్డర్ కాపీ ఇంకా అందకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. తమకు కోర్డు ఆర్డర్ కాపీ అందిన తర్వాతే వంశీని విడుదల చేస్తామని జైలు అధికారులు చెబుతున్నారు. మరోవైపు, వంశీ విడుదల నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు కోర్టు వద్దకు చేరుకున్నారు. ఇంకోవైపు, వైద్య చికిత్స తర్వాత వంశీ ఆరోగ్యం మెరుగుపడిన అనంతరం వంశీని మళ్లీ జైలుకు తరలిస్తారు.


