రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా నియమింపబడిన ఏడుగురు న్యాయమూర్తులతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా సోమవారం ప్రమాణం చేయించారు. అమరావతిలోని మొదటి కోర్టు హాల్లో నూతన న్యాయమూర్తులుగా తర్లాడ రాజశేఖరరావు, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, సత్తి సుబ్బారెడ్డి, చీమలపాటి రవి, కొనకంటి శ్రీనివాసరెడ్డి, వడ్డిబోయిన సుజాత, ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం ఏపీ హైకోర్టుకు ఏడుగురిని న్యాయమూర్తులుగా సిఫారసు చేసింది. దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.