Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అది భారత్‌కే సాధ్యం: యోగి

లక్నో: రష్యా యుద్ధంతో అట్టుడుకుతున్న ఉక్రెయిన్‌ నుంచి భారతదేశం మాత్రమే తమ పౌరుల్ని వెనక్కి రప్పించేందుకు చర్యలు తీసుకుందని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుని సురక్షితంగా లక్నో చేరుకున్న గోరఖ్‌పూర్‌ విద్యార్థులతో ఆయన మాట్లాడారు. రష్యా సైనిక చర్యతో ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్‌ గగనతలాన్ని మూసివేయడంతో భారత ప్రభుత్వం అక్కడ చిక్కుకుపోయిన మన పౌరుల్ని పొరుగు దేశాలైన రొమేనియా, హంగరీ, స్లోవేకియా, పోలండ్‌ వంటి దేశాల సరిహద్దుల నుంచి సురక్షితంగా తీసుకొచ్చిందన్నారు. ఇతర దేశాలు తమ పౌరుల్ని అక్కడే వదిలేస్తే.. భారత్‌ మాత్రం విద్యార్థులు, పౌరుల్ని సురక్షితంగా స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకుందని తెలిపారు. ‘ఇలాంటి సౌకర్యం కేవలం భారత పౌరులు, విద్యార్థులకే ఉంది. మీతో పాటు ఉక్రెయిన్‌లో చదువుకుంటున్న ఇతర దేశాల విద్యార్థులు అక్కడే ఉండిపోవడం మీరు చూసే ఉంటారు. వారిని తరలించే విషయంలో ఆయా దేశాలు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీకి రొమేనియా, హంగరి, పోలండ్‌ దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. అందువల్లే ఎలాంటి సమస్యా ఎదురవ్వలేదు. ఆయా దేశాల సరిహద్దుల్లో భారతీయులకు దక్కిన సదుపాయాలు మరే ఇతర దేశాల విద్యార్థులకూ దక్కలేదు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలైన వెంటనే భారతీయుల్ని వెంటనే రప్పించేందుకు మోదీ సమీక్ష నిర్వహించారు. యూపీ ప్రభుత్వం విద్యార్థుల వివరాలను సేకరించి నోడల్‌ అధికారుల్ని నియమించింది. మోదీ కూడా నలుగురు కేంద్రమంత్రుల్ని పంపారు. ఉక్రెయిన్‌లో మొత్తంగా 2290 మంది యూపీ విద్యార్థులు ఉండగా.. ఇప్పటివరకు 2078 మందిని తీసుకొచ్చాం. ఇంకా మిగిలిన వారిని తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లూ చేశాం. గోరఖ్‌పూర్‌కు చెందినవారే 74మంది ఉండగా.. 70మందిని ఇక్కడికి తరలించాం. మిగతా నలుగురిని కూడా తీసుకొస్తున్నాం’ అని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img