విశాలాంధ్ర -రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ నవదుర్గా అమ్మవారి దేవస్థానంలో గురువారం (16-10-2025) హుండీలు లెక్కింపు జరిగాయి. గత 36 రోజుల కాలానికి గాను భక్తులచే సమర్పించబడిన విరాళాల లెక్కింపు జరపగా మొత్తం రూ.2,79,269/- వసూలైనట్లు అధికారులు ప్రకటించారు.హుండీ లెక్కింపును ప్రత్యేక అధికారి బి.వి. మధవరావు , నవదుర్గ ఆలయ ఈవో పొన్నాడ శ్యామలరావు, వంశపారంపర్య ధర్మకర్తలు వానపల్లి నర్సింగరావు, గ్రామ పెద్దలు, కురాడ వెంకటరావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భక్తుల నుంచి లభిస్తున్న విరాళాలు ఆలయ అభివృద్ధి, ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తామని తెలిపారు.ఆలయ ప్రాంగణంలో హుండీ లెక్కింపు సందర్భంగా అనేకమంది స్థానికులు, భక్తులు పాల్గొని స్వచ్ఛందంగా సహకరించారు. భక్తుల భక్తిశ్రద్ధలు చూసి నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. శ్రీ నవదుర్గా అమ్మవారి ఆలయం రాజాం పరిసర ప్రాంతాల్లో అత్యంత ప్రాచీన దేవస్థానాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందగా, ప్రతి రోజు వందలాది మంది భక్తులు తల్లిని దర్శించుకోవడానికి వస్తున్నారు. నవరాత్రులు, దసరా పండుగల సందర్భంగా ఆలయానికి భక్తుల రద్దీ విశేషంగా పెరుగుతుందని, ఆలయ ఈవో పొన్నాడ శ్యామలరావు తెలిపారు.


