సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత గజ్వేల్ ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫామ్హౌస్ వద్ద రాజకీయ ఉద్రిక్తత నెలకొంది.గజ్వేల్ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ఎన్నికైన కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంలేదని ఆరోపిస్తూ జిల్లా కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈనేపథ్యంలో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులు ఫామ్హౌస్ను ముట్టడించేందుకు యత్నించారు.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వినేందుకు ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడం, అసెంబ్లీలో ప్రజల గొంతుకగా నిలవాల్సిన బాధ్యతను కేసీఆర్ విస్మరిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేగా చట్టసభకు హాజరై నియోజకవర్గ అభివృద్ధి అంశాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మాట్లాడాల్సిన బాధ్యత ఉందని వారు స్పష్టం చేశారు.
ఫామ్హౌస్ ప్రధాన గేటు వద్ద బైఠాయించిన నిరసనకారులు కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఎమ్మెల్యేగా తన విధులను నిర్వర్తించేందుకు అసెంబ్లీకి వెళ్లే ఆసక్తి లేకపోతే వెంటనే పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నికైన ప్రతినిధి సభకు రాకుండా ఫామ్హౌస్కే పరిమితం కావడం ఓటర్లను అవమానించడమేనని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు.
ఈ నిరసనలతో ఎర్రవల్లి పరిసర ప్రాంతాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేపట్టారు.


