చత్తీశ్గఢ్లో విజయవంతమైన ప్రాజెక్టు
చత్తీశ్గఢ్: పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వ్యర్థాలను వినియోగించి తారును తయారు చేశారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద ఛత్తీస్గఢ్లోని సర్గుజా జిల్లా మైన్పాట్ ప్రాంతంలో చేపట్టిన ప్లాస్టిక్ వ్యర్థాలతో రహదారులు నిర్మించే పైలట్ ప్రాజెక్టు విజయవంతమైంది. ఒక కిలోమీటరు మేర ప్లాస్టిక్ వ్యర్థాలు కలిపిన తారు, కంకరలతో రోడ్డు వేశారు. దీంతో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద రహదారి నిర్మాణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను విస్తృతంగా ఉపయోగించేందుకు మార్గం సుగమం అయింది. మైన్పాట్ ప్రాంతంలో ప్లాస్టిక్తో రహదారుల నిర్మాణానికి అవసరమైన సామగ్రి తయారీకి ఒక పరిశ్రమను కూడా ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో నిర్మించే రహదారులు సాధారణ రోడ్ల కన్నా ఎక్కువ మెరుపు కలిగి ఉంటాయని తెలిపారు. పర్యావరణ సమస్యగా మారిన ప్లాస్టిక్ను నిర్మాణ కార్యకలాపాల్లో ఉపయోగించడం వల్ల పరిసరాలూ శుభ్రమవుతాయి. రహదారి నిర్మాణంలో వాడే తారు బరువులో 8 శాతం మేర ప్లాస్టిక్ కలుపుతామని పీఎంజీఎస్వై ఇంజినీరు వికాస్ కౌశిక్ తెలిపారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద మహిళా స్వయం సహాయక బృందాలు సేకరించే ప్లాస్టిక్ వ్యర్థాలకు కిలోకు రూ.25 చొప్ప్పున చెల్లిస్తుండటంతో నిరుపేద మహిళలు లబ్ధి పొందుతున్నారు. అటు పర్యావరణ యుతంగా రహదారులు నిర్మాణానికి ప్లాస్టిక్ వ్యర్థాలను వినియోగంలోకి తీసుకువస్తున్నారు. వినూత్న ఆలోచనలతో ఇటువంటి మరెన్నో నూతన ఆవిష్కరణలు చేయడానికి ఈ ప్రాజక్టు ఒక ప్రేరణగా నిలుస్తుంది. ఔత్సాహికులు, శాస్త్రవేత్తలు మరిన్ని ప్రయోగాలకు ముందుకు రావడానికి అవకాశం ఉంది.


