భారతదేశానికి చెందిన యువ గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద నార్వే చెస్ టోర్నీలో మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు.ప్రపంచ అగ్రశ్రేణి చెస్ ఆటగాడు మాగ్నెస్ కార్ల్సన్ను మంగళవారం జరిగిన పోటీలో ఓడించి అందరి దృష్టిని ఆకర్షించాడు. కార్ల్సన్పై ప్రజ్ఞానంద సాధించిన ఇది రెండో విజయం కావడం విశేషం. ఈ గెలుపుతో అతడు ప్రస్తుత టోర్నీలో 12 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు.
మరోవైపు, ఎనిమిదోసారి నార్వే చెస్ టైటిల్ను సొంతం చేసుకోవాలన్న కార్ల్సన్ లక్ష్యానికి ఈ ఫలితం గట్టి ఎదురుదెబ్బగా మారింది.
14 పాయింట్లతో అగ్రస్థానంలో వెస్లీ సో..
టోర్నీలో ఇంకా రెండు రౌండ్లు మాత్రమే మిగిలి ఉండటంతో, ప్రస్తుత ఛాంపియన్గా ఉన్న కార్ల్సన్కు టైటిల్ను నిలబెట్టుకోవడం క్లిష్టంగా మారింది. అమెరికాకు చెందిన గ్రాండ్మాస్టర్ వెస్లీ సో ప్రస్తుతం 14 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. జర్మనీ ఆటగాడు విన్సెంట్ కీమర్పై ఆర్మాగెడాన్ టైబ్రేక్లో విజయం సాధించడం ద్వారా వెస్లీ తన ఆధిక్యాన్ని మరింత బలోపేతం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా, ఫ్రాన్స్కు చెందిన అలీరెజా ఫిరౌజ్జా ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ డి. గుకేశ్పై విజయం సాధించి 13 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.
టైటిల్ కోసం పోరాటం..
ఈ పరాజయంతో గుకేశ్కు నార్వే చెస్ టైటిల్ను గెలుచుకునే అవకాశాలు దాదాపు ముగిసినట్లయ్యాయి.
ప్రస్తుతం అతడి ఖాతాలో 8 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. మిగిలిన రెండు క్లాసికల్ గేమ్లలో విజయం సాధించినప్పటికీ అతడు గరిష్ఠంగా 14 పాయింట్లకే చేరుకోగలడు. దీంతో టైటిల్ పోటీలో అతడి అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయి. అయితే ప్రజ్ఞానంద పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది.
టైటిల్ కోసం అతడి పోరాటం ఇంకా కొనసాగుతోంది. కార్ల్సన్ను అతడి స్వదేశంలోనే ఇప్పటికే రెండుసార్లు ఓడించిన ప్రజ్ఞానంద, ఈ విజయంతో టైటిల్ రేసులో బలమైన పోటీదారుడిగా ఎదిగాడు.
అతడి ప్రదర్శన భారత చెస్ అభిమానుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.


