వాషింగ్టన్: ఇరాన్తో యుద్ధం ముగించాలనే తీర్మానాన్ని అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. దీంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తీర్మానానికి 215 అనుకూల.. 208 మంది వ్యతిరేక ఓట్లు వచ్చాయి. నలుగురు రిపబ్లికన్లు ట్రంప్ చర్యలకు వ్యతిరేకంగా ఓటు వేయడం చర్చనీయాంశంగా మారింది. వృథా ఖర్చు ఎందుకని, యుద్ధానికి వెంటనే ముగింపు పలకాలని చట్టసభ్యులు డిమాండ్ చేశారు. ఈ తీర్మానాన్ని విదేశీ వ్యవహారాల కమిటీ సీనియర్ సభ్యుడు, న్యూయార్క్ డెమొక్రటిక్ ప్రతినిధి గ్రెగొరీ మీక్స్ ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ఆమోదిస్తేనే ఇరాన్పై సైనిక చర్యలు తీసుకోవాలని ట్రంప్ను ఆమోదిస్తూ ‘వార్ పవర్స్ రిజల్యూషన’ను సభ ఆమోదించింది. ఈ తీర్మానానికి సెనెట్ ఆమోదం లభిస్తే, అధ్యక్షుడి సంతకం కోసం పంపుతారు. అయితే ఆయన వీటో చేసే అవకాశమున్నది. కుదిరిన కాల్పుల విరమణను పునరుద్ధరించేందుకు ఇజ్రాయిల్-లెబనాన్ అంగీకరించాయి. అమెరికా మధ్యవర్తిత్వంలో నాలుగో విడత చర్చల అనంతరం ఇందుకు అంగీకారం తెలిపాయి. వివాదాలను పూర్తిగా పరిష్కరించేందుకు ప్రత్యక్ష చర్చలు జరిపేలా ఏకాభిప్రాయం కుదిరింది. హెజ్బుల్లా కాల్పులు నిలిపివేయాలని, దక్షిణ లిటాని సెక్టార్ నుంచి వైదొలగాలన్న షరతులతో ఈ ఒప్పందం జరిగింది.


