. ఉద్యోగులు అలసత్వం వీడాలి
. వ్యవస్థలో లోపాలపై చర్యలు
. సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయంలో ఎక్కడా అలసత్వం, అవినీతి, నిర్లక్ష్యం కనిపించకూడదని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టంచేశారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు సక్రమంగా జరగాలని, ప్రజల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ఆధారంగా అవసరమైన మార్పులు చేసుకుని పనిచేయాలని అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల నిర్వహణపై వివిధ రూపాల్లో సేకరించిన సమాచారంపై సచివాలయంలో సోమవారం సీఎం సమీక్ష చేశారు. పింఛన్ల పంపిణీ, అన్న క్యాంటీన్, ఎరువులు పంపిణీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం వంటి అంశాలపై ప్రజల నుంచి ఐవీఆర్ఎస్, క్యూఆర్ కోడ్ స్కానింగ్తో పాటు అనేక మార్గాల్లో నిర్వహించిన సర్వే నివేదికలపై సమీక్షించారు. కొన్ని ప్రభుత్వ పథకాల అమలులో అక్కడక్కడా ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ఫీడ్బ్యాక్పై సమగ్రంగా విచారించి పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఎవరైనా పింఛను ఇంటి వద్ద అందడం లేదని ఫిర్యాదు చేసినా, దీపం పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ డెలివరీలో సమస్యలు వచ్చినా, అవినీతి ఉన్నా, ఆసుపత్రిలో సేవలపై అసంతృప్తి వ్యక్తం చేసినా వాటిపై చర్చించి చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా కార్యక్రమాలపై ప్రజలు తమ స్పందనలో అసంతృప్తి వ్యక్తం చేసిన సదరు లబ్ధిదారుల వద్దకు వెళ్లి కారణాలు విశ్లేషించాలని సూచించారు. వ్యక్తుల వల్ల గాని, వ్యవస్థలో లోపాల వల్లగాని సమస్య ఉన్నట్లు తేలితే…ప్రతి కాల్ పై విశ్లేషించి చర్యలు తీసుకోవాలని సూచించారు. పొరపాట్లు జరిగితే సరిదిద్దాలని…ఉద్యోగుల నిర్లక్ష్యం, అవినీతి ఉంటే మాత్రం సహించవద్దని సీఎం స్పష్టంచేశారు. ఉదయం 5 గంటలకు, 6 గంటలకు పింఛన్ల పంపిణీ మొదలు పెట్టాల్సిన అవసరం లేదని అధికారులకు సీఎం సూచించారు. ఉదయం 7 గంటలకు పింఛన్ల పంపిణీ మొదలుపెట్టి…సాయంత్రం 6 లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇదే సమయంలో ఇంటి వద్దనే పింఛను అనే విధానం పక్కాగా అమలు కావాలన్నారు. ప్రజల నుంచి అభ్యంతరం లేనంత వరకు ఇలాంటి చోట్ల వెసులుబాటు కల్పించాలని, పింఛను పంపిణీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు…లబ్ధిదారులతో గౌరవంగా, సౌకర్యవంతంగా వ్యవహరించాలని సీఎం సూచించారు. గ్యాస్ పంపిణీ విషయంలో ఎక్కడైనా అవినీతి జరిగితే…గ్యాస్ ఏజెన్సీలను బాధ్యులను చేయాలన్నారు. ఎరువుల సరఫరాపై సమీక్ష సందర్భంగా రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకంపై అధికారులతో సీఎం ఆరా తీశారు. పంటల సాగు విషయంలో రైతులను కొత్త సాగు పద్దతుల వైపు తీసుకువెళ్లాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగాలు రైతులకు వివరించి..వారిని ప్రోత్సహించాలన్నారు. మితిమీరిన స్థాయిలో రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకం వల్ల కలిగే దుష్ఫలితాలను వివరించాలని, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో విపరీతంగా పురుగు మందులు వాడడం వల్ల క్యాన్సర్ రోగుల సంఖ్య పెరిగిందని, ఇది ఎంతో ప్రమాదకరమని సూచించారు.