ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా
కరోనా థర్డ్వేవ్ వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు. ఆయన మీడియా సంస్థతో మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో కొవిడ్ కేసులు కాస్త పెరిగే అవకాశం ఉందన్నారు. అయితే థర్డ్వేవ్ వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని చెప్పారు. ప్రజలందరూ కొవిడ్ టీకా వేయించుకోవాలన్నారు. దీంతో కరోనా వైరస్ సోకినా తేలికపాటి లక్షణాలుంటాయని, తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉండదని చెప్పారు. టీకాలు వేయకపోవడంతో చిన్నారులకు ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉందని చెప్పారు. అయితే తేలికపాటి లక్షణాలుంటాయని, తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉండదని ప్రపంచ డేటాలో వెల్లడైందన్నారు. దేశంలో ఇటీవల నిర్వహించిన సీరో సర్వేలో 55-60 శాతం మంది పిల్లల్లో ఇప్పటికే యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. విద్యార్థులకు భౌతిక తరగతులు చాలా ముఖ్యమైనవని అభిప్రాయపడారు.అయితే పాఠశాలల్లో కఠిన పర్యవేక్షణ ఉండాలని స్పష్టంచేశారు.