భారత్-కెనడా సంబంధాల్లో నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతలకు ముగింపు సూచిస్తూ, ఇరుదేశాలు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై మళ్లీ చర్చలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి.
జోహానెస్బర్గ్లో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో జరిగిన సమావేశం తర్వాత ఈ నిర్ణయం వెలువడింది.
2023లో చర్చలను ఆపేసిన కెనడా
CEPAచర్చలు మొదట 2010లో ప్రారంభమై, 2022 నాటికి ఫార్మాస్యూటికల్స్, కీలక ఖనిజాలు, పర్యాటకం, పునరుత్పాదక శక్తి వంటి విభాగాల్లో గణనీయమైన పురోగతి చూశాయి.కానీ 2023లో కెనడా ఈ చర్చలను అనుకోకుండా నిలిపివేసింది.ప్రస్తుతం, భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఇరుపక్షాలు 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 50 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లే లక్ష్యంతో, మరింత ప్రతిష్టాత్మకమైన CEPAకు దారితీసేలా ముందుకు సాగుతున్నాయి.అదనంగా, సివిల్ న్యూక్లియర్ సహకారం, యూరేనియం సరఫరాకు సంబంధించిన దీర్ఘకాల ఒప్పందాలపై చర్చలు కూడా మళ్లీ చురుకుదనం పొందాయి.


