Homeజాతీయంవెండిపై కేంద్రం మరిన్ని ఆంక్షలు..

వెండిపై కేంద్రం మరిన్ని ఆంక్షలు..

- Advertisement -

దేశంలోకి వెండి దిగుమతులు రికార్డు స్థాయిలో పెరిగిపోవడంతో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. వెండి దిగుమతులపై ఆంక్షలను మరింత కఠినతరం చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు పరిమితులు లేని వెండి గింజలు , పొడి రూపాలను కూడా పరిమిత దిగుమతుల కేటగిరీలోకి చేర్చింది. ఇకపై ఈ రకమైన వెండిని దిగుమతి చేసుకోవాలంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) నుంచి తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

ఇటీవల భారీగా పెరిగిన‌ వెండి దిగుమతి.. కేంద్రం క‌ఠిన నిర్ణ‌యం
ప్రపంచంలోనే అత్యధికంగా వెండిని వినియోగించే దేశంగా ఉన్న భారత్, ఇటీవలి కాలంలో భారీగా వెండిని దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల రూపాయి విలువపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గత నెలలో 99.9% స్వచ్ఛత కలిగిన వెండి కడ్డీలు, ఇతర పాక్షికంగా తయారు చేసిన వెండి ఉత్పత్తుల దిగుమతిని కూడా పరిమిత కేటగిరీలో చేర్చిన విషయం తెలిసిందే. అంతేగాక‌ బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15%కి పెంచింది. అధిక చమురు ధరల కారణంగా విదేశీ మారక నిల్వలపై పడుతున్న భారాన్ని తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.

గణాంకాలను పరిశీలిస్తే.. 2026 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్ రికార్డు స్థాయిలో 12 బిలియన్ డాలర్ల విలువైన వెండిని దిగుమతి చేసుకుంది. అంతకుముందు ఏడాది ఈ దిగుమతుల విలువ కేవలం 4.8 బిలియన్ డాలర్లు మాత్రమే. ఈ ఏడాది ఏప్రిల్‌లోనూ వెండి దిగుమతులు గతేడాదితో పోలిస్తే 157% పెరిగి 411 మిలియన్ డాలర్లకు చేరాయి.

ప్రభుత్వ నిర్ణయంపై బులియన్ పరిశ్రమ వర్గాల స్పందన‌
ప్రభుత్వ తాజా నిర్ణయంపై బులియన్ పరిశ్రమ వర్గాలు స్పందించాయి. ప్రభుత్వం వెండి దిగుమతులను మరింత కష్టతరం చేసింది. ఇప్పుడు దిగుమతిదారులకు ముందస్తు అనుమతి తప్పనిసరి. అయితే ఆ అనుమతి వస్తుందో రాదో, ఎంత సమయం పడుతుందో స్పష్టత లేదు అని ముంబైకి చెందిన ఓ బులియన్ డీలర్ వ్యాఖ్యానించారు. భారత్‌లో వెండిని ఆభరణాలు, నాణేలు, కడ్డీలతో పాటు సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ వంటి పారిశ్రామిక అవసరాలకు కూడా విరివిగా వాడతారు. గత ఏడాది కాలంగా సంప్రదాయ వినియోగం కంటే పెట్టుబడుల రూపంలో వెండికి డిమాండ్ భారీగా పెరిగింది. ముఖ్యంగా సిల్వర్ ఈటీఎఫ్‌లలోకి పెట్టుబడులు రికార్డు స్థాయికి చేరాయి. భారత్ ప్రధానంగా యూఏఈ, బ్రిటన్, చైనా దేశాల నుంచి వెండిని దిగుమతి చేసుకుంటోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు