ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలతో పాటు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్)లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతన సవరణ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), నాబార్డ్లో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పింఛను సవరణకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో మొత్తం 46,322 మంది ఉద్యోగులు, 23,570 మంది పింఛనుదారులు, 23,260 మంది కుటుంబ పింఛనుదారులు లబ్ధి పొందనున్నారని శుక్రవారం ఆర్థిక శాఖ వెల్లడించింది. ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలకు సంబంధించిన వేతన సవరణ 2022 ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.8,170.30 కోట్లను వెచ్చించనుంది.
డీఏపై 10 శాతం పెంపును కేంద్రం మంజూరు
నాబార్డ్ ఉద్యోగులకు వేతన సవరణ 2022 నవంబరు 1 నుంచి అమలు చేయనున్నారు. అదనపు వార్షిక వేతనంగా రూ.170 కోట్లు చెల్లించడంతో పాటు, మొత్తం రూ.510 కోట్ల బకాయిలను విడుదల చేయనున్నారు. ఇదే సమయంలో ఆర్బీఐ పింఛనుదారులు, కుటుంబ పింఛనుదారులకు బేసిక్, డీఏపై 10 శాతం పెంపును కేంద్రం మంజూరు చేసింది. ఈ పింఛను సవరణ కూడా 2022 నవంబరు 1 నుంచి అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.


