విశాలాంధ్ర-తాడిపత్రి: గన్నేవారిపల్లి కాలనీ ప్రజలు ఏళ్ళ తరబడి ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. ఎమ్మెల్యే జె.సి. అస్మిత్ రెడ్డి చొరవతో కాలనీలో రోజువారీగా త్రాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.కాలనీ ప్రజలు మాట్లాడుతూ , గతంలో రెండు నుండి నాలుగు రోజులకు ఒక్కసారి మాత్రమే త్రాగునీరు అందుబాటులో ఉండేదని, ముఖ్యంగా ఆర్ డబ్ల్యూఎస్ ఆఫీస్ వెనుక భాగంలో ఉన్న దాదా కోళ్ల ఫారం పరిసరాల్లో వారానికి ఒక్కసారి మాత్రమే నీరు రావడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవని తెలిపారు.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి కాలనీలో పర్యటించిన సమయంలో ప్రజలు సమస్యను నేరుగా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, మండల గ్రాంట్ నిధులతో దాదాపు ₹14 లక్షల విలువైన కొత్త మోటార్ పరికరాలు ఏర్పాటు చేయించి, గండికోట నుంచి వచ్చే నీటి తీసుకు రావడానికి, అదనంగా పంచాయతీ రాజ్ కార్యాలయంలో ఉన్న పిఆర్ ట్యాంకును పునరుద్ధరించి, త్రాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచారు. గన్నేవారి పల్లె కాలనీలో ప్రతిరోజు త్రాగునీరు సరఫరా అయ్యేవిధంగా చర్యలు తీసుకొని త్రాగునీటి సమస్య లేకుండా చేశాడని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే జె.సి. అస్మిత్ రెడ్డికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.


