విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛఆంధ్రా కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఉరవకొండ పట్టణాన్ని స్వచ్ఛత పట్టణంగా రూపొందించేందుకు ప్రజలు తోడ్పాటు అందించాలని ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శి గౌస్ సాహెబ్ తెలిపారు. శనివారం ఉరవకొండ పట్టణంలో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలలో భాగంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. వివిధ ప్రభుత్వ పాఠశాలలు కార్యాలయాలు ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతూ, దేశంలో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర దివస్ కార్యక్రమం అమలుకు ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగానే ప్రతినెలా మూడో శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ కార్యక్రమాన్ని ఉరవకొండ పట్టణంలో పటిష్టంగా అమలు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మినుగ లలిత, పంచాయతీ వార్డు సభ్యులు, టిడిపి పార్టీ నాయకులు, పంచాయతీ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.


