విశాలాంధ్ర – కడియం : ఒకపక్క వివాహా శుభ ముహూర్తాలు, మరోపక్క మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకునే వరలక్ష్మీ వ్రతాలు ఓకేసారి రావడంతో పూల ధరలకు రెక్కలు వచ్చాయి. కడియం మండలం, కడియపులంక అంతర్రాష్ట్ర పూల మార్కెట్ అమ్మకం దారులు, కొనుగోలుదారులతో బుధవారం క్రిక్కిరిసిపోయింది. ప్రస్తుత సీజన్లో ఉభయగోదావరి జిల్లాలలో పూల దిగుబడులు అంతగా లేకపోవడంతో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు చిత్తూరు జిల్లా నుండి ఉండే బంతి, చామంతి, గులాబీ వంటి రకాలను టన్నులు కొలది ఈ మార్కెట్ కు దిగుమతి చేసుకున్నారు. అలాగే వివాహాది శుభకార్యాలకు కావలసిన డెకరేషన్ పువ్వులను బెంగళూరు ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ఈ మార్కెట్ కు తీసుకువచ్చారు. వివాహ ముహూర్తాలు ఉండడంతో ఈ పూలకు ఎక్కడలేని డిమాండ్ వచ్చింది. అంతేగాక శ్రావణ శుక్రవారంకు అవసరమైన పూల కొనుగోలుకు కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర జిల్లాలతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి కొనుగోలుదారులు వచ్చి పూలను కొనుగోలు చేసి తీసుకువెళుతున్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల నుంచి కొనుగోలుకు వ్యాపారులు తరలివచ్చారు. అంతేగాక ఆర్డర్లపై స్థానిక పూల వ్యాపారులు ఆర్టీసీ బస్సులు ద్వారా ఎగుమతులు చేపట్టారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గల కడియం, ఆలమూరు, ఆత్రేయపురం మండలాలలో సాగయ్యే కనకాంబరం, లిల్లీ, మల్లి, జాజులు, గులాబీ వంటి పూల పంటలు దారుణంగా దిగుబడి తగ్గింది. అందువల్ల ప్రస్తుత సీజన్లో వాటి ధరలు మరింత అధికమయ్యాయి. బుధవారం కడియపులంక పూల మార్కెట్లో పూల ధరలు ఈ విధంగా ఉన్నాయి.
చామంతి కేజీ రూ.400-450,
వైట్ చామంతి రూ.460,
ఎరుపు చామంతి రూ. 400,
నీలం చామంతి రూ. 300,
బంతి రూ.100 నుంచి 120,
కనకాంబరాల బారు రూ. 150- నుంచి 170,
గులాబీ రూ.250,
జాజులు రూ.600,
లిల్లీ రూ. 450,
మల్లి రూ. 1000,
హైబ్రిడ్ గులాబీ కట్ట రూ.250.


