Homeజాతీయంప్రపంచంలోనే తొలిసారి.. ఒకే వ్యక్తికి పంది కాలేయం, రెండు కిడ్నీలు అమర్చిన చైనా వైద్యులు

ప్రపంచంలోనే తొలిసారి.. ఒకే వ్యక్తికి పంది కాలేయం, రెండు కిడ్నీలు అమర్చిన చైనా వైద్యులు

- Advertisement -

వైద్య శాస్త్ర రంగంలో చైనా పరిశోధకులు మరో కీలక ఘట్టాన్ని నమోదు చేశారు. ప్రపంచంలోనే తొలిసారిగా ఒకే వ్యక్తికి పంది నుంచి సేకరించిన కాలేయంతో పాటు రెండు మూత్రపిండాలను విజయవంతంగా అమర్చారు. జన్యుపరంగా మార్పులు చేసిన పంది నుంచి తీసిన మూడు అవయవాలను ఒకేసారి మనిషికి మార్పిడి చేయడం వైద్య చరిత్రలో ఇదే మొదటిసారి.
సౌత్ చైనాలోని ఓ విశ్వవిద్యాలయంలో సన్ జుయాంగ్ నేతృత్వంలోని పరిశోధక బృందం ఈ అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించింది. ఈ విషయాన్ని వారు సోమవారం అధికారికంగా వెల్లడించారు.
వైద్య పరిభాషలో ఃఆర్థోటోపిక్ జెనోట్రాన్స్‌ప్లాంటేషన్ఃగా పిలిచే ఈ ప్రక్రియ ద్వారా పంది కాలేయం, రెండు కిడ్నీలను ఒకేసారి మానవ శరీరంలో అమర్చారు.

బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి పంది కాలేయం, రెండు కిడ్నీల మార్పిడి
ఈ పరిశోధన కోసం బ్రెయిన్‌డెడ్ అయిన 53 ఏళ్ల వ్యక్తి శరీరాన్ని ఉపయోగించారు.
అతని కుటుంబ సభ్యుల సమ్మతితోనే ఈ శస్త్రచికిత్స చేపట్టినట్లు పరిశోధకులు తెలిపారు.
ఇందుకోసం చైనాలోని గ్వాంగ్జీ జువాంగ్ ప్రాంతానికి చెందిన ప్రత్యేక ఃబామాః జాతి పంది నుంచి అవయవాలను సేకరించారు.
సాధారణంగా జంతువుల అవయవాలను మానవ శరీరం తిరస్కరించే ప్రమాదం ఉంటుంది.
దీనిని నివారించేందుకు శాస్త్రవేత్తలు పంది జన్యువుల్లో ప్రత్యేక మార్పులు చేశారు.
రోగనిరోధక వ్యవస్థ అవయవాలను తిరస్కరించడానికి కారణమయ్యే మూడు జన్యువులను తొలగించారు.
అదే సమయంలో రక్త ప్రసరణను మెరుగుపరచడంతో పాటు మానవ శరీరానికి అనుకూలంగా ఉండే మూడు మానవ జన్యువులను పందిలో ప్రవేశపెట్టారు.

మనిషి శరీరంలో పంది అవయవాలు విజయవంతంగా పనిచేస్తున్నాయని వెల్లడి
శస్త్రచికిత్స పూర్తైన 24 గంటల వ్యవధిలోనే ఆశాజనక ఫలితాలు కనిపించాయి.
మార్పిడి చేసిన పంది కాలేయం పైత్యరసాన్ని ఉత్పత్తి చేయడం ప్రారంభించగా, రెండు మూత్రపిండాలు కూడా సక్రమంగా పనిచేయడం మొదలుపెట్టాయి. బాధితుడి రక్తంలో క్రియాటినిన్ స్థాయులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకోవడం మూత్రపిండాల పనితీరుకు నిదర్శనమని పరిశోధకులు వెల్లడించారు.
ఈ ఆపరేషన్‌లో సన్ జుయాంగ్ అభివృద్ధి చేసిన ప్రత్యేక ఆర్థోటోపిక్ శస్త్రచికిత్స పద్ధతిని ఉపయోగించారు.
ఒకే శస్త్రచికిత్స కోత ద్వారా కాలేయం, రెండు కిడ్నీలను అమర్చడం ఈ టెక్నిక్ ప్రత్యేకతగా నిలిచింది.

ఒకేసారి బహుళ జంతు అవయవాలు మానవ శరీరంలో సమర్థవంతంగా పనిచేయగలవని ఈ అధ్యయనం స్పష్టంచేసిందని పరిశోధక బృందం పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవయవ దాతల కొరత సమస్యకు ఇది భవిష్యత్తులో కీలక పరిష్కారంగా మారే అవకాశముందని వారు అభిప్రాయపడ్డారు.
జెనోట్రాన్స్‌ప్లాంటేషన్ రంగంలో ఈ విజయం మరిన్ని క్లినికల్ ప్రయోగాలకు మార్గం సుగమం చేస్తుందని, అవయవ మార్పిడి వైద్య విధానాల్లో కొత్త అవకాశాలకు తెరతీస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు