భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ పతకాల విజేత పూసర్ల వెంకట సింధు చరిత్ర సృష్టించింది. కెరీర్ లో 500 మ్యాచుల్లో విజయం సొంతం చేసుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా సింధు రికార్డు క్రియేట్ చేసింది. అలానే ప్రపంచలో ఆరో మహిళా షట్లర్ గా సింధు చరిత్రకెక్కింది. తాజాగా ఇండోనేషియా మాస్టర్స్-2026 టోర్నమెంట్లో ఈ 500 విజయాల మైలు రాయిని అందుకుంది. ఇండోనేషియా మాస్టర్స్-2026 టోర్నీలో భాగంగా ప్రిక్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్ షట్లర్ ఫో లినే హోజ్మార్క్ జేర్ఫీల్డ్ను 21-19, 21-18 తేడాతో ఓడించింది. నలభై మూడు నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో సింధు ఘన విజయం సాధించి.. క్వార్టర్ ఫైనల్కు దూసుకువెళ్లింది. ఇండోనేషియా మాస్టర్స్లో ప్రిక్వార్టర్ ఫైనల్లో సూపర్ విక్టరీ సాధించిన సింధు.. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నెం.4వ స్థానంలో ఉన్న చైనాకు చెందిన చెన్ యూ ఫీ రూపంలో గట్టి పోటీ ఎదుర్కోనుంది. వీరిద్దరు ఇప్పటి వరకు పదమూడు సార్లు ముఖాముఖి తలపడగా చెన్ 7, సింధు 6 సార్లు విజయం సాధించారు. చివరగా 2019లో చెన్ను సింధు ఓడించింది. తన తదుపరి మ్యాచులో చెన్ పై విజయం సాధించి.. తన రికార్డును మెరుగుపర్చుకోవాలని సింధు ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మరోవైపు ఇదే టోర్నీలో లక్ష్య సేన్ సైతం క్వార్టర్ ఫైనల్కు చేరాడు. అరగంటకు పైగా సాగిన పోరులో హాంకాంగ్ షట్లర్ జేసన్ గునావన్పై 21-20, 21-11 తేడాతో గెలిచి లక్ష్య సేన్ ముందుడుగు వేశాడు.


