2022-23 ఆర్థిక సంవత్సరంలో రైల్వే ప్రయాణికుల నుంచి టాయిలెట్లలో, వాష్బేసిన్లలో నీరు లేకపోవడంపై మొత్తం 1,00,280 ఫిర్యాదులు వచ్చాయని భారత కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (జAG) తాజాగా పార్లమెంట్లో సమర్పించిన నివేదికలో వెల్లడించింది. వాటిలో 33,937 ఫిర్యాదులు (సుమారు 34%) నిర్ణీత సమయానికి పరిష్కారం కాలేదని నివేదిక స్పష్టం చేసింది. లాంగ్ డిస్టెన్స్ రైళ్లలో శుభ్రత,పరిశుభ్రతఁ అంశంపై 2018-19 నుంచి 2022-23 వరకు చేసిన ఆడిట్ నివేదికలో ఈ వివరాలు పొందుపరిచారు.
దూరప్రయాణ రైళ్లలో బయో-టాయిలెట్ల శుభ్రతపై కూడా సర్వే
రైళ్లలో భారీగా ప్రయాణికులు ప్రయాణించే కారణంగా పరిశుభ్రత కాపాడటం అత్యంత అవసరమని, ఇది నేరుగా ప్రజా ఆరోగ్యం, భద్రతపై ప్రభావం చూపుతుందని సీఏజీ హైలైట్ చేసింది. దూరప్రయాణ రైళ్లలో బయో-టాయిలెట్ల శుభ్రతపై కూడా సర్వే జరిపారు.96 రైళ్లలో ప్రయాణిస్తున్న 2,426 మంది ప్రయాణికులను సంప్రదించగా, ఐదు జోన్లలో 50% కంటే ఎక్కువమంది సంతృప్తిగా ఉన్నారని, మరో రెండు జోన్లలో మాత్రం 10% కన్నా తక్కువమందే సంతృప్తి వ్యక్తం చేశారని నివేదిక పేర్కొంది.
అలాగే, కోచ్లలో నీటి కొరతపై తరచూ వస్తున్న ఫిర్యాదులకు కారణం నీరు సరైన సమయంలో నింపకపోవడం లేదా తగినన్ని సదుపాయాలు లేకపోవడమే అని సీఏజీ స్పష్టంచేసింది.


