విశాలాంధ్ర, కళ్యాణదుర్గం.. కళ్యాణదుర్గం మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభిస్తున్నట్లు మార్కెట్ యార్డు చైర్మన్ లక్ష్మీదేవి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆమె మార్కెట్ యార్డులో అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రస్తుతానికి మార్కెట్లో దళారుల కారణంగా రైతులు నష్టపోతున్న పరిస్థితి ఉందని, దాన్ని అరికట్టేందుకే ప్రభుత్వ ఆధ్వర్యంలో నేరుగా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వివరించారు. రైతులు పండించిన కందులకు ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకారమే కొనుగోలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. రైతులు తమ కందులను శుభ్రంగా, తేమ శాతం నియమావళికి అనుగుణంగా తీసుకురావాలని చైర్మన్ సూచించారు. ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు, రైతు భరోసా/పట్టాదారు పాసు పుస్తకం వంటి అవసరమైన ధృవపత్రాలు వెంట తెచ్చుకోవాలని తెలిపారు. కొనుగోలు చేసిన పంటకు సంబంధించి డబ్బులు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రాజశేఖర్, డైరెక్టర్ కుబేర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


