టిబెటన్ బౌద్ధమత గురువు దలైలామా తన మనోభావాలను వెల్లడించారు. రానున్న 30, 40 సంవత్సరాలు ప్రజలకు సేవ చేయాలన్నదే తన ప్రధాన ఆకాంక్ష అని ఆయన స్పష్టం చేశారు. తాను మరికొంత కాలం పాటు ఆరోగ్యంగా జీవించగలననే దైవ సంకేతాలు తనకు అందుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
జూలై 6న 90వ పుట్టినరోజు జరుపుకోనున్న సందర్భంగా తన అనుచరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను 110 ఏళ్లు జీవిస్తానని గతంలో కలగన్న చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
మరోవైపు, తన వారసుడి ఎంపిక ప్రక్రియపై కూడా దలైలామా కీలక ప్రకటన చేశారు. 15వ దలైలామాను ఎంపిక చేసే అధికారం కేవలం ఃగాడెన్ ఫోడ్రోంగ్ ట్రస్ట్ఃకు మాత్రమే ఉందని ఆయన తేల్చి చెప్పారు. 2011లోనే తన వారసుడి ఎంపికపై బౌద్ధ మత పెద్దలతో చర్చించి, వారి సానుకూల అభిప్రాయం తీసుకున్నట్లు గుర్తు చేశారు. ఈ విషయంలో ఇతర శక్తుల జోక్యాన్ని సహించబోమని చైనాను ఉద్దేశించి పరోక్షంగా హెచ్చరించారు.
టిబెట్పై పట్టు సాధించేందుకు దలైలామా వారసుడి ఎంపికను తమ ఆధీనంలోకి తీసుకోవాలని చైనా చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే పంచయిన్ లామా వారసుడిగా ఎంపికైన బాలుడిని చైనా ప్రభుత్వం తన అదుపులోకి తీసుకుంది. చైనా యొక్క వ్యూహాలను ముందుగానే గ్రహించిన దలైలామా, తన పునర్జన్మ టిబెట్ వెలుపల కూడా జరగవచ్చని, తన వారసుడిని ఎంపిక చేసే ప్రక్రియ తమదేనని ఇదివరకే పలుమార్లు స్పష్టం చేశారు.