తమిళనాడు ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తీసుకొచ్చిన తొలి బడ్జెట్ కావడంతో దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఆర్థిక మంత్రి ఎన్. మేరీ విల్సన్ బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టారు. ఇందులో విద్య, నైపుణ్యాభివృద్ధి, మహిళా సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో భాగంగా ఃఅన్నన్ సీర్ తిట్టమ్ః పథకాన్ని ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. ఈ పథకం కింద వివాహం చేసుకునే వధువులకు 8 గ్రాముల బంగారంతో పాటు ఒక పట్టుచీర అందించనుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.812 కోట్లు కేటాయించింది.
లక్ష మంది ఉద్యోగార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ
యువతలో ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో 2031 నాటికి ఐదు లక్షల మందికి కృత్రిమ మేధ (AI)లో శిక్షణ అందించనున్నట్లు ప్రకటించింది. ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు ఈ కార్యక్రమంలో భాగమవుతారు. అలాగే ఃవెట్రిథిరన్ ట్రైనింగ్ స్కీమ్ః ద్వారా దశలవారీగా లక్ష మంది ఉద్యోగార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. విద్యార్థులకు సాంకేతిక విద్యను మరింత చేరువ చేసేందుకు వెట్రి ల్యాప్టాప్ స్కీమ్ పేరుతో రూ.2,000 కోట్ల వ్యయంతో ఉచిత ల్యాప్టాప్ల పంపిణీ చేపట్టనున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.300 కోట్లు కేటాయించారు.
కుటుంబ పెద్దగా ఉన్న మహిళలకు ప్రతి నెల రూ.2,500 ఆర్థిక సాయం
ఃపుతియా పయనం-పుతియా వేగంః పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో 11వ తరగతి చదువుతున్న 5.3 లక్షల మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేయనున్నారు. సైకిళ్లతో పాటు హెల్మెట్లు, వాటర్ బాటిళ్లు కూడా అందజేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఎన్నికల సమయంలో ప్రకటించిన కొన్ని కీలక హామీలపై ఈ బడ్జెట్లో ఎలాంటి ప్రకటన చేయలేదు. కుటుంబ పెద్దగా ఉన్న మహిళలకు ప్రతి నెల రూ.2,500 ఆర్థిక సాయం,ఏడాదికి ఆరు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం,అలాగే మహిళలకు అన్ని ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి హామీలు బడ్జెట్లో చోటు దక్కించుకోలేదు.


