. డబ్బులేకుండా ప్రచారమెలా సాధ్యం
. రెండు రూపాయలూ ఖర్చు చేయలేకున్నాం
. కాంగ్రెస్ను ఆర్థికంగా దెబ్బతీసే రాజకీయ పన్నాగం
. మమ్మల్ని ఎన్నికల్లో పోటీ చేయనిచ్చే ఉద్దేశం మోదీకి లేదా!
. బ్యాంకు ఖాతాల స్తంభనపౖౖె సోనియా, ఖడ్గే, రాహుల్ ఆగ్రహం
న్యూదిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ అన్న మాటల్లో ఏ మాత్రం నిజం లేదని కాంగ్రెస్ నేతలు దుయ్యబట్టారు. ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ చేతిలో చిల్లిగవ్వ లేకుండా చేయడమేనా ప్రజాస్వామ్యం అంటే అని పాలకపక్షాన్ని నిలదీశారు. తమ బ్యాంకు ఖాతాలను ఐటీ అధికారుల ద్వారా స్తంభింపచేయడాన్ని బీజేపీ రాజకీయ కుట్రగా అభివర్ణించారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించారని విమర్శించారు. తమ ఖాతాలను వెంటనే డీఫ్రీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే, మాజీ అధ్యక్షులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ గురువారం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మోదీ ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిరచారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీని ఎన్నికల వేళ బలహీనపర్చేందుకు మోదీ వ్యూహాలు, కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల వేళ బ్యాంకు ఖాతాలు స్తంభింపచేయడాన్ని ఆక్షేపించారు. ఈ చర్యతో కేవలం కాంగ్రెస్సే కాదు…ప్రజస్వామ్యం కూడా ప్రభావితమవుతుందని అన్నారు. తమ ఖాతాలను వెంటనే డీఫ్రీజ్ చేయాలని ఖడ్గే డిమాండ్ చేశారు. ఎన్నికల బాండ్ల రూపేణ అధికార పక్షం భారీగా విరాళాలు సేకరించిందని ఆరోపించారు. బీజేపీ పాలకులకు రాజ్యాంగబద్ధ సంస్థలపై ప్రత్యక్ష లేక పరోక్ష నియంత్రణ ఉన్నదన్నారు. అభ్యర్థులకు ఇచ్చేందుకు తమ వద్ద డబ్బు లేదని అన్నారు. సమయం చూసి కాంగ్రెస్ను దెబ్బతీస్తున్నారని బీజేపీపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘మేము ప్రచారం ఎలా నిర్వహించాలి. ఎన్నికలకు ఎలా వెళ్లాలి. మా సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకే ఇలా చేశారు’ అని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా కాంగ్రెస్ పార్టీపై నేరపూరిత చర్య తీసుకున్నారు. మా బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ఎలాంటి లావాదేవీలు చేయలేని స్థితికి తెచ్చారు. ప్రచారం కోసం ప్రకటనలు ఇవ్వలేకపోతున్నాం. మా నేతలను ఎక్కడికీ పంపలేకపోతున్నాం. విమానాల్లో కాదు కదా… రైలు టికెట్లు కొనడానికీ డబ్బు లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ ఖాతాలు ఫ్రీజ్ చేయడం మాత్రమే కాదు… భారత ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోవడమే అవుతుంది. 20 శాతం ఓటర్లు మాకు మద్దతుగా ఉన్నా… రెండు రూపాయలు కూడా ఖర్చు చేయలేకపోతున్నాం. ఎన్నికల్లో పోరాడకుండా మా సామర్థ్యాన్ని అడ్డుకుంటున్నారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదు’ అని రాహుల్ విమర్శల వర్షం కురిపించారు. మీ బ్యాంకు ఖాతాలు స్తంభింపజేస్తే ఏమవుతుంది… ఏటీఎంలు పనిచేయక చేతిలో డబ్బు లేకపోతే మనుగడ సాధ్యమేనా? ప్రస్తుతం కాంగ్రెస్ అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ ఖాతాలను ఫ్రీజ్ చేయడం ప్రజాస్వామ్యాన్ని ఫ్రీజ్ చేయడమే అని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యమే లేదని, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ అన్న వాదన అవాస్తవమని దుయ్యబట్టారు. ప్రజాస్వామిక కార్యాచరణను పరిరక్షించే వ్యవస్థలు కొన్ని ఉంటాయి. కానీ అవి ప్రేక్షకపాత్ర వహిస్తున్నాయని రాహుల్ అన్నారు.
సోనియాగాంధీ మాట్లాడుతూ తాజా పరిణామం కేవలం కాంగ్రెస్ను ఆర్థికంగానే కాదు… ప్రజాస్వామ్యాన్ని కూడా దెబ్బతీస్తుందని, దీని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తమ ఖాతాల్లోని డబ్బును బలవంతంగా లాగేసుకున్నారని, ప్రధాని వ్యూహాత్మకంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అనేక సవాళ్లు ఎదురవుతున్నా ఎన్నికల ప్రచారం సమర్థంగా సాగేందుకు చేయగలిగినదంతా చేస్తున్నామన్నారు. ఓ వైపు ఎన్నికల బాండ్లు… మరోవైపు ప్రతిపక్ష పార్టీలను ఆర్థికంగా దెబ్బతీసే చర్యలు కొనసాగుతున్నాయని సోనియాగాంధీ అన్నారు. లోక్సభ ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను డీఫ్రీజ్ చేయించాలని రాజ్యాంగబద్ధ సంస్థలను ఖడ్గే కోరారు. బీజేపీ వేల కోట్లలో విరాళాలు తీసుకుని.. తమ ఖాతాలను స్తంభింప చేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిష్పాక్షిక ఎన్నికలు తప్పనిసరని, ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు ఉండాలన్నారు. మోదీ పాలనలో భారతదేశ ప్రతిష్ఠ దిగజారుతోందన్నారు. తమ బ్యాంకు ఖాతాలు స్తంభిపజేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఖడ్గే ఆరోపించారు. ఏఐసీసీ కోశాధికారి అజయ్ మాకెన్ మాట్లాడుతూ ‘మా ఖాతాలు మాత్రమే ఫ్రీజ్ చేయించడం వెనుక మర్మమేమిటి? కాంగ్రెస్ పార్టీకి సామాన్య ప్రజలు ఇచ్చిన విరాళాలను బీజేపీ లూటీ చేసింది. ఎన్నికల బాండ్ల ద్వారా ఎవరు ఎంత లబ్ధి పొందారో ప్రజలకు తెలుసు’ అని అన్నారు. బీజేపీ అప్రజాస్వామిక విధానాలు అవలంబిస్తోందని విమర్శించారు. పోస్టర్లు వేయించే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 బ్యాంకు ఖాతాలను ఎందుకు ఫ్రీజ్ చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ను ఎన్నికల్లో పోటీ చేయనివ్వకూడదనేదే బీజేపీ ఉద్దేశంగా కనిపిస్తోందని ఆరోపించారు.