‘సినీ’ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి: ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు
విశాలాంధ్ర – హైదరాబాద్: సినీ పరిశ్రమలో పైరసీని అరికట్టేందుకు కఠిన చర్యలు చేపడుతున్నామని, ఇందు కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. ఎఫ్డీసీ ఎండీ సిహెచ్. ప్రియాంకతో కలిసి సమాచార శాఖ ఎఫ్డీసీ బోర్డు రూమ్ లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే ఉప ముఖ్య మంత్రితో కీలక సమావేశాలు నిర్వహించా మని, సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సమగ్ర కార్యాచ రణను సిద్ధం చేస్తున్నామని వివరించారు. అవసరమైతే నూతన నిబంధనల రూపకల్పన చేస్తామన్నారు. ఎఫ్డీసీ నోడల్ ఏజెన్సీగా, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సైబర్ సెల్, పోలీస్ శాఖల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసి, సినిమా షూటింగ్లకు ఆన్లైన్ అనుమతుల ప్రొసెస్తో పాటు వీడియో పైరసీ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని దిల్ రాజు పేర్కొన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందరం కలిసి ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రియాంక మాట్లాడుతూ సినిమా జర్నలిస్టుల అక్రిడిటేషన్ అంశంపై సమీక్ష జరిపి, సాధ్యసాధ్యాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.