Homeముంచుకొస్తున్న ముప్పు

ముంచుకొస్తున్న ముప్పు

- Advertisement -

. ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
. మరో మూడు రోజులు భారీ వర్షాలు
. పొంగుతున్న వాగులు, వంకలు
. కృష్ణాకు మళ్లీ వరద
. శ్రీశైలం, ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేత

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా… మరో 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చైనా- హాంకాంగ్‌లో బీభత్సం సృష్టించిన విఫా తుపాను బంగాళాఖాతంలోకి ప్రవేశించిందని పేర్కొంది. తుపాను కారణంగా రాబోయే మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, క్రమేపీ ఇది బలపడుతుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో వచ్చే మూడు రోజులు ఏపీలో విస్తారంగా వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్‌, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం తీరం వెంబడి గంటకు 60 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
శ్రీశైలం, ప్రకాశం బ్యారేజీ గేట్ల ఎత్తివేత
ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదికి మళ్లీ వరద నీరు వస్తోంది. కృష్ణా పరివాహక ప్రాంతంలో వరదలు రావడంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో జలాశయం నుండి మంగళవారం మరోసారి గేట్లు ఎత్తి దిగువ సాగర్‌కు నీరు విడుదల చేశారు. జలాశయానికి ఇన్‌ప్లో 87,536 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా… 95,346 క్యూసెక్కుల నీరు కిందకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు 6వ రేడియేషన్‌ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి సాగర్‌కు నీరు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రాలలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.50 అడుగులకు చేరింది. పూర్తిసామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 209.1579 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కృష్ణానదిలో దిగువున ఉన్న ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పెరుగుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్‌కి ఇన్‌ఫ్లో 20,748 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా… బ్యారేజ్‌ 25 గేట్లు అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ కాల్వలకు 2,623 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తుండగా… 18,125 క్యూసెక్కులు నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
పొంగుతున్న వాగులు, వంకలు
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అనేక ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అనేకచోట్ల గడ్డలు వాగులు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి జనజీవనం స్తంభించింది. పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు, పనులకు వెళ్లేవారు ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా డుంబ్రిగూడ, గూడెం కొత్త వీధి మండలంలోని అనేక కాలువలు వరద నీరుతో పొంగి ప్రవహిస్తున్నాయి. జీకే వీధి మండలం సామగెడ్డ రోడ్డు మీదుగా గొల్లపల్లికి వెళ్లే రోడ్డు వద్ద రెండు పెద్ద వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దారకొండ పంచాయతీ పరిధిలో సుమారు 10 గ్రామాల ప్రజలు నివసిస్తున్నారు. సోమవారం నుంచి వర్షాలు కురుస్తుండడంతో గొల్లపల్లి, పెబ్బంపల్లి వాగులు పొంగితే జీపు, ద్విచక్ర వాహనాలు, ఆ గ్రామ ప్రజలు మార్కెట్‌కు, పంచాయతీ కార్యాలయం, ఆసుపత్రికి వెళ్లాలంటే వాగులు దాటాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ వాగులకు వంతెనలు మంజూరు చేసి నిర్మాణాలు చేపట్టాలని మండల, జిల్లా అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో చిన్నపాటి వర్షానికి కూడా జర్రెల కొత్తూరు`రాసకోట మధ్య కాలువ పొంగి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు