– ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్.
పోతుకుంటలో పార్క్, ఆర్వో ప్లాంట్కు శ్రీకారం.
విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని పోతుకుంట గ్రామంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటించి, గ్రామంలో ఉన్న వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి నమస్సులు అర్పించారు. అనంతరం గ్రామంలో సంస్కృతి స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో నిర్మితమైన ఆర్వో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈ ఆర్వో ప్లాంట్ నిర్మాణానికి రూ.10 లక్షల ఖర్చు చేయబడింది అని, గ్రామంలోని బీసీ కాలనీలో నివసిస్తున్న సుమారు 500 కుటుంబాలకు ఈ ప్లాంట్ ద్వారా సురక్షితమైన, పరిశుభ్రమైన తాగునీరు నిరంతరంగా అందించబడనుంది అని పేర్కొన్నారు. అలాగే, గ్రామంలోనే ఒక నూతన పార్క్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని గుర్తించి, అక్కడ భూమి పూజ నిర్వహించి, త్వరలో పార్క్ నిర్మాణం ప్రారంభమవుతుందని మంత్రి హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా, ప్రజలకు ఆరోగ్యవంతమైన జీవనవేగం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పోతుకుంట సర్పంచ్ నాగవేణి, పట్టణ అధ్యక్షులు చంద్ర, రూరల్ అధ్యక్షులు గొట్లూరు చంద్ర, మార్కెట్ యార్డ్ చైర్మన్ అరుణ శ్రీ, బిజెపి మహిళా నాయకురాలు కంచం లీలావతి, బిజెపి నాయకులు పోతుకుంట రాజు, కోటి బాబు, బిల్లే శ్రీనివాసులు, బోయ పెద్ద లింగమయ్య బ్రదర్స్, స్థానిక బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.