మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో స్తబ్ధత నెలకొనడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, సుప్రీంకోర్టు విధించిన కాలపరిమితి కారణంగానే సీబీఐ విచారణ ముందుకు సాగడం లేదని టీడీపీ నేత బీటెక్ రవి ఆరోపించారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు ముగియడంతోనే సీబీఐ ఈ కేసును పక్కన పెట్టిందని, ఈ విషయాన్ని వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారని గుర్తుచేశారు. కేసు దర్యాప్తు గడువును పొడిగిస్తేనే హత్య వెనుక ఉన్న పెద్ద కుట్ర బయటపడుతుంది. నిందితులు స్వేచ్ఛగా బయట తిరుగుతూ సాక్షులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు అని బీటెక్ రవి ఆందోళన వ్యక్తం చేశారు. వివేకా అల్లుడిపైనా, సీబీఐ అధికారి రామసింగ్పైనా దురుద్దేశంతో తప్పుడు కేసులు బనాయించారని, వాటిని సుప్రీంకోర్టు కొట్టివేస్తూ చేసిన వ్యాఖ్యలే వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికార దుర్వినియోగానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. ఈ కేసులో అవినాశ్ రెడ్డి పాత్రపై న్యాయస్థానం గతంలోనే వ్యాఖ్యానించిందని తెలిపారు.
పులివెందుల ఫలితంపై జగన్కు సవాల్
ఇటీవల జరిగిన పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలో వైసీపీ ఓటమిని జీర్ణించుకోలేకే జగన్ రిగ్గింగ్ ఆరోపణలు చేస్తున్నారని బీటెక్ రవి మండిపడ్డారు. ఁఅసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లు రాగానే ఈవీఎంలపై నెపం నెట్టారు. ఇప్పుడు సొంత నియోజకవర్గంలో డిపాజిట్ కోల్పోగానే అక్కసు వెళ్లగక్కుతున్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే, దమ్ముంటే జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. మేము జడ్పీటీసీ స్థానానికి రాజీనామా చేస్తాం. కేంద్ర బలగాల పర్యవేక్షణలో రెండు ఎన్నికలనూ మళ్లీ నిర్వహిద్దాంఁ అని ఆయన సవాల్ విసిరారు. పులివెందుల ప్రజల తీర్పును గౌరవించకుండా, ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి అసెంబ్లీకి రాకుండా జగన్ ఆ పదవికి అనర్హుడిగా మారారని బీటెక్ రవి తీవ్రస్థాయిలో విమర్శించారు.


