గౌహతి : రాష్ట్రంలోని 80 మున్సిపాలిటీల్లో ఆదివారం పోలింగ్ నిర్వహిస్తున్నట్టు అసోం రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడిరచింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 24 జిల్లాలోని 80 మున్సిపాలిటీల్లోని 977 వార్డులకు పోలింగ్ ఏర్పాట్లు పూర్తి అయినట్టు ఎస్ఈసీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా స్థానిక పురపోరులో ఈవీఎంలను వినియోగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం 2,532 మంది అభ్యర్థులు బరిలో నిలువగా వారిలో బీజేపీ నుంచి 825 మంది, కాంగ్రెస్ నుంచి 706, ఆసోమ్ గణ పరిషత్ (ఏజీపీ) నుంచి 243 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నట్టు తెలిపింది. ఇక ఈ ఎన్నికల్లో 8,32,348 మంది పురుషులు, 8,41,534 మంది మహిళలు, 17 మంది ట్రాన్స్జెండర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నట్టు అధికారులు తెలిపారు. కాగా ఈ ఎన్నికలకు సంబంధించి ఈ నెల తొమ్మిదో తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని వివరించారు