వైసీపీ బీసీ నాయకురాలు అనూ యాదవ్ అక్రమ అరెస్టుపై మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపాటు
విశాలాంధ్ర – రాజమండ్రి సిటి ; రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఫ్లెక్సీ పై పేడ రాశారనే అభియోగంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అను యాదవ్ పై కేసు నమోదు చేసి త్రీటౌన్ పోలీసు స్టేషన్ కు తీసుకురావడంతో మాజీ ఎంపీ, వైసీపీ నగర అధ్యక్షుడు,రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ స్టేషన్ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.శుక్రవారం ఆమె ఇంటికి వెళ్ళిన పోలీసులు అనూ యాదవ్ ను స్టేషన్ కు తీసుకు వచ్చి రెండు గంటలు కూర్చోబెట్టారు. విషయం తెలిసి అక్కడకు చేరుకున్న వైసీపీ శ్రేణులు భరత్ ఆధ్వర్యంలో ఆందోళన చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.పోలీసులు దిగివచ్చి ఆమెకు 41 సీఆర్పీ నోటీసులు ఇచ్చి బయటకు పంపించారు. వైసీపీ శ్రేణులు ఇంటికి వెళ్ళిపోతుండగా పోలీసు స్టేషన్ గేటు వద్ద. సీఐ అప్పారావు అడ్డుకున్నారు. ఆయన మళ్లీ స్టేషన్ లోకి రావాలని కోరడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపట్ల. త్రీ టౌన్ ఎస్ఐ అప్పలరాజు దురుసుగా ప్రవర్తించడంతో మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. దీంతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. దురుసుగా ప్రవర్తించిన సిఐపై. చర్యలు తీసుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డిమాండ్ చేశాయి.ఈ సందర్భంగా మార్గాని భరత్ మీడియాతో మాట్లాడుతూ మహిళలపై వరుసగా జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా ఫ్లెక్సీలోని రాజమండ్రిలో ఈవీఎం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ముఖంపై కోపంతో ఎవరైనా పేడ రాసి ఉండొచ్చు.అంతమాత్రంచేత బీసీ వర్గానికి చెందిన మహిళా నాయకురాలు అనూ యాదవ్ ను అరెస్టు చేసి ఎలా తీసుకు వస్తారని ప్రశ్నించారు.తుని,రాజమండ్రి ప్రభుత్వ వసతి గృహంలో జరిగిన సంఘటనలపై మహిళలు ప్రశ్నిస్తే ఈవీఎం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కేసు పెట్టిస్తారా అని ఆయన నిలదీశారు.అసలు బాలికల వసతి గృహం వద్ద ఈవీఎం ఎమ్మెల్యే ఫ్లెక్సీ ఎందుకు,దానికి పర్మిషన్ ఉందా అని ఆయన ప్రశ్నించారు.మోరంపూడి ఫ్లై ఓవర్ వద్ద తన పేరుతో ఉన్న శిలాఫలకాన్ని ఆదిరెడ్డి వాసు అనుచరులు గునపాలతో బద్దలు కొట్టినప్పుడు తాను ఫిర్యాదు చేసినా ఎవరి మీద చర్యలు తీసుకోలేదని,ఇప్పుడు మాత్రం పేడ రాశారని ఏకంగా పదిమంది పోలీసులు అనూ యాదవ్ ఉంటున్న అపార్టమెంట్ కు వెళ్ళి అరెస్టు చేయడమేమిటని భరత్ నిలదీశారు.ఇది ఆమె గౌరవానికి భంగం కలిగించడమేనని మండిపడ్డారు.ఎమ్మెల్యే మనిషి మద్యం సిండికేట్ కు సంబంధించి మాట్లాడిన ఆడియో బయటపెడితే ఎలాంటి చర్యలు తీసుకోని పోలీసులు మహిళను రెండు గంటలు స్టేషన్ లో కూర్చోబెట్టారని ఆయన విమర్శించారు. వారిపై కోర్టులో కేసు వేస్తామని హెచ్చరించారు. అనూ యాదవ్ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఫ్లెక్సీపై పేడ రాసినట్లు సీసీ పుటేజీ ఉందని పోలీసులు చెబుతున్నారని,మరి నగర టీడీపీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు ఆడియో ను తమ నాయకుడు మార్గాని భరత్ బయటపెడితే పోలీసులు చర్యలు తీసుకోలేదని విమర్శించారు.ఇలాంటి కేసులకు తాను భయపడేది లేదన్నారు. న్యాయవాది శంభూ ప్రసాద్ మాట్లాడుతూ 41 నోటీసులు ఇచ్చి పంపాల్సిన ఈ కేసులో పోలీసులు అతిగా స్పందించి అనూ యాదవ్ ను అరెస్టు చేసి స్టేషన్ కు తీసుకు వచ్చారని,దీనిపై న్యాయపరంగా పోరాటం చేస్తామని చెప్పారు.


