అందెశ్రీకి సీపీఐ ఘన నివాళి
విశాలాంధ్ర- హైదరాబాద్: కవి, నంది అవార్డు గ్రహీత అందెశ్రీ మృతి తీవ్ర దిగ్భాంతిని కలిగించిందని, ఆయన మృతి కళారంగానికి తీరని లోటని సీపీఐ ప్రముఖులు పేర్కొన్నారు. తన పాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేశారన్నారు. అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గేయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గేయంగా ప్రకటించిం దన్నారు. అది కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు. మనిషి గురించి ఆయన రాసిన పాట కళ్లకు కట్టినట్టు చూపించారని వారు గుర్తు చేశారు. పముఖ విప్లవకవి, వాగ్గేయకారుడు, తెలంగాణ వేగుచుక్క రాలిపోవడం ప్రగతి శీల ఉద్యమాలకు తీరని లోటన్నారు. ప్రజాకళలు వర్ధిల్లినంతకాలం ఆయన పేరు అజరామరంగా నిలిచి ఉంటుందని పేర్కొన్నారు. సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు, సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, జాతీయ కార్యదర్శులు పల్లా వెంకట్ రెడ్డి, కె.రామకృష్ణ, పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవైన శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమావత్ అంజయ్య నాయక్, మందా పవన్, రేగుంట చంద్రశేఖర్ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ తదితర ప్రముఖులు… ప్రజా కవిగా అందెశ్రీ ప్రజాకళలకు, ఉద్యమాలకు చేసిన సేవలు మరుపురానివని, ప్రజా కళాకారులకు, కవులకు మరణం ఉండదంటూ ఆయన మృతికి సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కాగా, లాలాపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో అందెశ్రీ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
ప్రగతిశీల ఉద్యమాలకు తీరని లోటు
- Advertisement -


