. టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమా
విశాలాంధ్ర`విజయవాడ : విజయవాడ నగరంలో బార్ లైసెన్స్ల కేటాయింపులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చెప్పారు. స్థానిక మొగల్రాజపురంలోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రూరల్ ప్రాంతాల్లో రూ.20లక్షలు ఉన్న బార్ లైసెన్స్లను వేలంపాటలో రూ.80లక్షల వరకు వచ్చిందని, విజయవాడ నగరంలో మాత్రం కేవలం రూ.50లకు పాట ముగియడం వెనుక కుట్ర ఉందని అనుమానం వ్యక్తంచేశారు. తాము అధికారంలోకి వస్తే మధ్యపాన నిషేధం చేస్తామని చెప్పిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పుడు రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్గా మార్చివేశారని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోందని, కేవలం రూ.15 విలువ చేసే మద్యం రూ.300లకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం మద్యం షాపులలో ఎక్కడా కూడా ఆన్లైన్ లావాదేవీలు లేకుండా కేవలం నగదు మాత్రమే తీసుకుంటూ దోచుకుంటున్నారని, మహిళల మాంగళ్యాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఈ మద్యం మాఫియా చిట్టా మొత్తం త్వరలోనే బయటకు వస్తుందని, అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, నాయకులు వీరమాచినేని కిషోర్, సింగం వెంకన్న, అశోక్, పుచ్చ పవన్, రాంబాబు, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.