బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని పార్టీ ఎమ్మెల్యేల బృందం బుధవారం రాజ్భవన్లో గవర్నర్తో భేటీ అయ్యింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరిస్తోందని ఈ సందర్భంగా వారు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలపై పోలీసులు దాడులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ, అందుకు సంబంధించిన ఆధారాలను గవర్నర్కు సమర్పించారు.
అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల పాలనకు నిరసనగా నల్ల చొక్కాలు ధరించి అసెంబ్లీకి వెళ్లిన తమ ఎమ్మెల్యేలపై పోలీసులు దౌర్జన్యం చేశారని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని అవమానించారని, ఈ దాడులపై కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు. దీనికి విరుద్ధంగా తమ పార్టీ నేతలపైనే అక్రమంగా కేసులు బనాయించారని ఆయన మండిపడ్డారు.
వంద రోజుల్లోనే హామీలన్నీ అమలు చేస్తామని నమ్మబలికిన కాంగ్రెస్, 1,000 రోజులు గడిచినా 420కి పైగా వాగ్దానాలను గాలికొదిలేసిందని కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు కింద రూ. 73,000 కోట్లు అందిస్తే, ప్రస్తుత ప్రభుత్వం కనీసం యూరియాను కూడా సరఫరా చేయలేని దుస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. రైతు బీమాను నీరుగార్చి, నిరుద్యోగ యువతను మోసం చేస్తోందని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిణామాలపై తక్షణమే జోక్యం చేసుకోవాలని గవర్నర్ను కోరినట్లు కేటీఆర్ వివరించారు.


