విశాలాంధ్ర-హైదరాబాద్:
తెలంగాణలో పలు ముఖ్యమైన ప్రవేశ పరీక్షలకు షెడ్యూళ్లు విడుదలయ్యాయి. 2025-26 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో ఇంజినీరింగ్/ అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ (ఎప్సెట్)తో పాటు టీజీ ఐసెట్, పీజీ ఈసెట్లకు ఉన్నత విద్యామండలి వేర్వేరుగా అధికారిక వెబ్సైట్లో షెడ్యూల్ను విడుదల చేసింది. జేఎన్టీయూ వీసీ ఛాంబర్లో సెట్ల కమిటీ తొలి సమావేశం సోమవారం జరిగింది. ఈ భేటీలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డితో పాటు ఆయా సెట్ల కన్వీనర్లు, కో- కన్వీనర్లు, ఇతర ఉన్నతాధికారులు హాజరై ఈ మూడు సెట్ల షెడ్యూళ్లకు ఆమోదం తెలిపారు. టీజీఈఏపీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ జేఎన్టీయూ- హెచ్ అధ్వర్యంలో జరగనుంది. ఈ నెల 22 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించను న్నారు. మే రెండో తేదీ నుంచి ఐదో తేదీ వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. తెలంగాణ పీజీ ఈసెట్ షెడ్యూల్ను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. మార్చి 12న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. 17 నుంచి 19 వరకు దరఖాస్తులు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. జూన్ 16 నుంచి 19 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఐసెట్ పరీక్ష నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ అధ్వర్యంలో జరుగుతుంది. మార్చి ఆరున నోటిఫికేషన్ విడుదలకానుంది.