దావోస్ ప్రపంచ ఆర్థిక వేదికలో పాల్గొన్న ఎలాన్ మస్క్
ట్రంప్ ఏర్పాటు చేసిన శాంతి బోర్డుపై వ్యంగ్యాస్త్రాలు
టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (ఔజుఖీ) సదస్సులో పాల్గొన్న ఆయన, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’ (శాంతి బోర్డు)పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బ్లాక్రాక్ సీఈఓ లారీ ఫింక్తో కలిసి ఒక ప్యానెల్ చర్చలో పాల్గొన్న మస్క్, ట్రంప్ శాంతి బోర్డు గురించి విన్నప్పుడు, అది ‘శాంతి’ (PEACE) కాదేమో, బహుశా ‘ముక్క’ (PIECE) అనుకున్నానని చమత్కరించారు. గ్రీన్లాండ్లో ఒక ముక్క, వెనిజువెలాలో ఒక ముక్క అన్నట్లుగా నాకు వినిపించింది అని వ్యాఖ్యానించారు. గాజా కాల్పుల విరమణ ప్రణాళికను పర్యవేక్షించేందుకు ట్రంప్ ఈ బోర్డును ఏర్పాటు చేయగా, ఇప్పుడు దాని పరిధిని విస్తరిస్తున్నారు.
భవిష్యత్తులో మనుషుల కంటే రోబోలే ఎక్కువ: మస్క్ జోస్యం
ఇదే చర్చలో భవిష్యత్తులో రోబోలు సమాజాన్ని పూర్తిగా మార్చేస్తాయని మస్క్ జోస్యం చెప్పారు. మానవ శ్రమ అవసరం తగ్గిపోతుందని, వస్తువులు, సేవల లభ్యత విపరీతంగా పెరుగుతుందని అన్నారు. ఒకానొక దశలో మనుషుల కంటే రోబోల సంఖ్యే ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. వృద్ధులను, పిల్లలను చూసుకోవడానికి ప్రతి ఒక్కరికీ రోబో అవసరమవుతుందని, వచ్చే ఏడాది చివరికల్లా టెస్లా రోబోలను ప్రజలకు అమ్మడం ప్రారంభిస్తుందని ప్రకటించారు.
గతంలో దావోస్ సదస్సును ఃప్రజలు కోరుకోని, ఎన్నుకోబడని ప్రపంచ ప్రభుత్వంః అంటూ తీవ్రంగా విమర్శించిన మస్క్, ఇప్పుడు అదే సదస్సుకు హాజరుకావడం గమనార్హం. ట్రంప్కు మద్దతుదారుగా ఉంటూనే, ఆయనతో గతంలో విభేదించి మళ్లీ సయోధ్య కుదుర్చుకున్న నేపథ్యంలో మస్క్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


