ప్రజలకు నేరాల పట్ల అవగాహన కార్యక్రమం
విశాలాంధ్ర-రాజాం ( విజయనగరం జిల్లా): నేరాల నియంత్రణలో భాగంగా ప్రజలకు నేరాల పట్ల అవగాహన కల్పించాలనే లక్ష్యంతో మంగళవారం రాజాం పట్టణం పరిసర ప్రాంతాల్లో ఆటోల ద్వారా ప్రచార కార్యక్రమం నిర్వహించినట్లు రాజాం పట్టణ సీఐ కె. అశోక్ కుమార్ తెలిపారు. విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.
రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజల రాకపోకలు అధికంగా ఉండటంతో దొంగతనాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అందువల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సీఐ సూచించారు. ఇటీవల కాలంలో చైన్ స్నాచింగ్లు, జేబుదొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో, జనసమూహాలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో నగదు, విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు.
ముఖ్యంగా మహిళలు అపరిచిత వ్యక్తుల వాహనాలు ఎక్కరాదని, ఎటువంటి అనుమానం కలిగినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే ప్రజలు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణం చేయాలని విజ్ఞప్తి చేశారు.
పండగకు ఊరు వెళ్తున్న సమయంలో ఇరుగు–పొరుగు వారికి సమాచారం ఇచ్చి వెళ్లాలని, ఇంటి పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని సీఐ కె. అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఈ ప్రచార రథం పట్టణం అంతటా తిరుగుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తుందని ఆయన తెలిపారు.


