దేశంలో త్వరలో పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లు చెలామణిలోకి రానున్నాయి. రూ.10, రూ.20 విలువ కలిగిన పాలిమర్ నోట్లను క్షేత్రస్థాయి ప్రయోగాల కోసం జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఒక్కో డినామినేషన్లో వంద కోట్ల చొప్పున నోట్లను ప్రయోగాత్మకంగా జారీ చేసే ప్రతిపాదనను ఆమోదించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటుకు వెల్లడించారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) సెంట్రల్ బోర్డు సిఫార్సు మేరకు ఃఆర్బీఐ చట్టం-1934ఃలోని సెక్షన్ 25 ప్రకారం ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపింది. ఈ క్షేత్రస్థాయి ప్రయోగాలు విజయవంతమైతే భవిష్యత్తులో ఈ రెండు విలువల్లోని పాలిమర్ నోట్లను క్రమబద్ధంగా జారీ చేసే అవకాశం ఉంటుంది. అయితే, ప్రస్తుతం చెలామణిలో ఉన్న కాగితపు నోట్ల స్థానంలో వీటిని తీసుకురావడం లేదని, వాటితో పాటే ఈ కొత్త నోట్లు కూడా అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పాలిమర్ నోట్ల సేకరణ ప్రక్రియ ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని ఆర్బీఐ పేర్కొంది. అందువల్ల, వీటిని ఎప్పుడు ప్రవేశపెడతారు, దీనికి ఎంత ఖర్చవుతుంది అనే విషయాలపై ఇప్పుడే కచ్చితమైన వివరాలు చెప్పలేమని తెలిపింది. అంతర్జాతీయంగా చూస్తే, కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు ఎక్కువ కాలం మన్నుతాయి. ఈ ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


